
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో థింసా, లంబాడీ వంటి గిరిజన నృత్యాలు ఆవిష్కృతమయ్యాయి. ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎస్ఎఫ్) జాతీయ కమిటీ ఆధ్వర్యానయూనివర్సిటీ క్యాంపస్లోని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజుల పాటు ఆదివాసీ సంస్కృతీ మహోత్సవాలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదివాసీ కళాకారులు ప్రదర్శించిన జానపద, థింసా, లంబాడీ వంటి నృత్య ప్రదర్శనలు సభికులను విశేషంగా అలరించాయి. వేదికపై ఆశీనులైన ముఖ్య అతిథులు సైతం స్పందించి, కొద్దిసేపు కళాకారులతో కలసి డ్యాన్సులేసి, విద్యార్థులను కేరింతలు కొట్టించారు.
ఉత్సవాల ప్రారంభ సభలో యూనివర్సిటీ ఇన్చార్జి ఉప కులపతి ఆచార్య వై.శ్రీనివాసరావు మాట్లా డుతూ, భారతీయ సంస్కృతిలో ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలు ఒక భాగమని, వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యతని అన్నారు. గోదావరి జిల్లాల్లోని గిరి జన, గిరిజనేతర విద్యార్థులందరికీ ఉన్నత విద్య అందిస్తూ, వారి ఉన్నతికి వర్సిటీ పరంగా కృషి జరుగుతోందని చెప్పారు.
రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాన్ని పరిరక్షించడంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.
రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ మాట్లాడుతూ, గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు, కళలతోనే సమాజ వికాసం జరుగుతుందన్నారు. అడవి బిడ్డల జీవన విధానం ప్రత్యేక శైలిలో, ఆరోగ్యకరంగా ఉంటుందని అన్నారు.
టీఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు కరంసి అక్కులప్ప నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప, ప్రధాన కార్యదర్శి మూడవత్ విష్ణు నాయక్ మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్ధిలో నాటికి, నేటికి పెద్దగా తేడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు.
గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించి, ప్రోత్సహించాలని టీఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లి భాస్కర్, సహాయ అధ్యాపకుడు దొర కోరారు. విద్యావంతులైన గిరిజన యువత ఈ–కామర్స్, డిజిటల్ వ్యాపారాలపై దృష్టి పెట్టాలన్నారు.
తొలుత ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు వర్సిటీ ప్రధాన ద్వారం నుంచి వేదిక వరకూ సంప్రదాయ నృత్యాలతో ఊరేగింపుగా చేరుకున్నారు. సెంట్రల్ లైబ్రరీ వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అంజలి ఘటించారు. కార్యక్రమంలో టీఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్రనాయక్, మహిళా అధ్యక్షురాలు మధులత, ఉపాధ్యక్షురాలు హేమలత, జిల్లా అధ్యక్షుడు రాజ్కుమార్, రాష్ట్ర నాయకులు, జానపద కళాకారులు భిక్షునాయక్, కంటి స్వాతి తదితరులు పాల్గొన్నారు.





