News

కుంభమేళాకు మోదీ.. త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం

248views

ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం ఈ వేడుక జరుగుతోన్న ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న ఆయన రుద్రాక్షలు చేతబూని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. తర్వాత గంగానదికి హారతి ఇచ్చి, పూజలు నిర్వహించారు.
తొలుత ప్రయాగ్‌రాజ్‌ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీ అక్కడినుంచి అరైల్‌ ఘాట్‌కు వెళ్లారు. ఘాట్‌ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరించారు. దానికి ముందు అక్కడి బోటులో ప్రయాణించారు. స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులకు బోటు నుంచే అభివాదం చేశారు. అప్పుడు ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఉన్నారు.
144 ఏళ్లకోసారి వచ్చే ఈ మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా.. భారత్‌తోపాటు విదేశాల నుంచి భారీసంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 26 వరకు ఈ వేడుక జరగనుంది. ఇప్పటివరకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపారరంగాలతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్య పౌరులతో కలిపి 38 కోట్లమంది పుణ్యస్నానాలు ఆచరించారు. ఈరోజు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు పుణ్యస్నానమాచరించారు. ఈ చరిత్రాత్మక సమయంలో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తోన్న తరుణంలో ప్రతిఒక్కరూ మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు.
మహా కుంభమేళా ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. రూ.5500 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.