
ఈ దృశ్యమేదో భారతీయ ఇతివృత్తంగా ఉన్న ప్రదర్శనలోనిది అని అనిపిస్తే తప్పు కాదు. అది రామాయణంలోని ఒక ఘట్టం. అయితే ప్రదర్శించిన వారు మాత్రం చైనా కళాకారిణులు. ఆదికావ్యం పేరుతో చైనాలో రామాయణ నృత్య ప్రదర్శన నిర్వహించారు. చైనాకు చెందిన ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి జిన్ షాన్సన్ ఆధ్వర్యంలో జనవరి 25న ఈ ప్రదర్శన జరిగింది. ఇందులో 80 మంది స్థానిక నర్తకీమణులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జీ జియాన్లెన్ మాండిరిన్ భాషలోకి అనువదించిన రామాయణంతో ప్రేరణ పొంది ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనకు అక్కడి భారత దౌత్య కార్యాలయం సహకారం అందించింది. చైనా వైస్ మినిస్టర్ సున్ హైయూన్ నృత్య ప్రదర్శనకు హాజరయ్యారు. ఈ ప్రదర్శన ఎంతో ప్రత్యేకమైనదని చైనాలో భారత రాయబారి ప్రదీప్ రావత్ వ్యాఖ్యానించారు. భారత్-చైనా సంబంధాలు సాధారణ స్థితికి తీసుకురావాలన్న ఆకాంక్షతో జనవరి 26న విదేశాంగ కార్యదర్శుల స్థాయి సమావేశం ఏర్పాటయిన నేపథ్యంలో ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.





