
మహా కుంభమేళాలో రెండో అమృత స్నానం జనవరి 29న జరగనుంది. అయితే దీని కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ అమృత స్నానం ఎందుకంత స్పెషల్, దీని ప్రాముఖ్యత ఏంటనే విషాయలను ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో ఆధ్యాత్మిక, మతపరమైన సంప్రదాయాల్లో ఒకటైన మహా కుంభమేళా 2025 ప్రస్తుతం అత్యంత పవిత్రమైన వేడుకగా నిర్వహిస్తున్నారు. ప్రతి 12 సంవత్సరాల తరువాత జరిగే ఈ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ కుంభమేళాలో పాల్గొనడం ద్వారా సాధువులు, భక్తులు సహా అనేక మందికి పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.
రెండో అమృత స్నానం
అయితే కుంభమేళాలో రెండో అమృత స్నానం జనవరి 29న జరగనుంది. దీనికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా 13 నాగ సాధు అఖాడాలు సంగం నది ఒడ్డున తమ శిబిరాలను ఏర్పాటు చేసుకుని భగవంతుని భక్తిలో మునిగిపోయారు. ఈ నాగ సాధువులే అమృత స్నాన రోజున ముందుగా స్నానం చేస్తారు.
ముందుగా సాధువుల స్నానం తర్వాత..
హిందూ మతంలో మహా కుంభమేళాకు భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. కారణం ఏమిటంటే ఇది 12 సంవత్సరాల తర్వాత వస్తుంది. అంతేకాకుండా దేశంలో ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్, ప్రయాగ్రాజ్లతో సహా 4 ప్రదేశాలలో మాత్రమే మహా కుంభమేళా జరుగుతుంది. నాగ సాధువుల మొదటి స్నానం మతం, ఆధ్యాత్మిక శక్తికి కేంద్రంగా పరిగణించబడుతుంది. అమృత స్నాన్లో ముందుగా 13 అఖాడాల నుంచి నాగులు, సాధువులు, ఆచార్యులు, మహామండలేశ్వరులు, స్త్రీ నాగ సాధువులు స్నానం చేస్తారు. ఆ తరువాత భక్తుల వంతు వస్తుంది. కుంభమేళా సంప్రదాయం ప్రకారం, అమృత స్నానం ప్రత్యేక తేదీలలో మాత్రమే జరుగుతుంది.
సాధువులు, సన్యాసులు ఎందుకు వస్తారు..
ఈ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి సాధువులు ఈ మహాకుంభానికి చేరుకుని పవిత్ర నదిలో స్నానం చేస్తారు. మత విశ్వాసం ప్రకారం మహా కుంభమేళాలో అమృత స్నాన్ (రాజ స్నానం) చేయడం వల్ల మోక్షం లభించి శరీరం మనస్సులో మలినాలు తొలగిపోతాయని భావిస్తారు. గ్రంథాల ప్రకారం మహా కుంభమేళాలో ఋషులు, సన్యాసులకు ఈ స్నానం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అమృత స్నానం చేయడం ద్వారా 1000 అశ్వమేధ యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. మహా కుంభమేళాలో అమృత స్నానం చేసిన తర్వాత, ఋషులు, సాధువులు భగవంతుడిని ధ్యానిస్తారు. ఈ కారణంగానే సాధువులు, ఋషులు లోక సంక్షేమం, మోక్షం కోసం మహా కుంభమేళాకు వస్తారు.
తర్వాత అమృత స్నానం ఎప్పుడు?
మహా కుంభమేళాలో మొదటి అమృతస్నానం జనవరి 14న పూర్తయింది. ఇప్పుడు జనవరి 29న జరిగే రెండో అమృతస్నానం వంతు వచ్చింది. దీని తరువాత మూడో అమృత స్నాన్ ఫిబ్రవరి 3న జరుగుతుంది. దీని తరువాత ఫిబ్రవరి 12న మాఘి పూర్ణిమ స్నానం మహాశివరాత్రి రోజు (ఫిబ్రవరి 26)న జరుగుతుంది.





