
మన నాగరికత వనవాసి, నగరవాసి, గ్రామ వాసి ఇలా ఉండేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు నాలుగు పీఠాలు స్థాపించారని.. తన బాల్యంలో కంచి మఠం పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరాచార్య సరస్వతి బోధనలు విన్నానని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో నాలుగు రోజుల పాటు జరిగిన లోక్ మంథన్ ముగింపు వేడుకలకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా.మోహన్భాగవత్, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్రసింగ్ షెకావత్, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘‘ ఇప్పటికీ రాజకీయ ప్రస్తావన వచ్చినప్పుడు, కొంతమంది బయటి నుంచి వలస వచ్చారనే చర్చ జరుగుతోంది. తమిళనాడులో కొన్ని సుబ్రహ్మణ్యం స్వామి క్షేత్రాలు ఉన్నాయి. వాటిని వనవాసీలు తమ దైవంగా పూజిస్తారు. ఆదివాసీల పట్ల వివక్ష ఉందని కొందరు అక్కడక్కడ మాట్లాడుతున్నారు. వనవాసి, నగరవాసి, గ్రామవాసి ఎవరైనా మన భారతీయులే’’ అన్నారు





