
కెనడా పార్లమెంట్ వెలుపల భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య.. ఓం అని రాసి ఉన్న జెండా ఎగురవేశారు. అధిక సంఖ్యలో హిందూకెనడియన్లు రాజకీయాల్లో భాగం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కెనడాలోని ఖలిస్థానీ వేర్పాటువాదులపై దాడులకు కేంద్రమంత్రి అమిత్ షా ఆదేశించారంటూ కెనడా మంత్రి చేసిన ఆరోపణలపై భారత్ ఆగ్రహం వ్యక్తంచేసింది. సిక్కు వేర్పాటువాదులను లక్ష్యంగా చేసుకుంటూ హింస, బెదిరింపులకు పాల్పడటం సహా గూఢచర్యం చేసి, విషయ సేకరణ చేయాలని భారత హోంమంత్రి అమిత్ షా ఆదేశించారని మంగళవారం కెనడా విదేశీ వ్యవహారాల ఉప మంత్రి డేవిడ్ మోరిసన్.. ఆ దేశ జాతీయ భద్రతా కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చారు. తాను ఇచ్చిన సమాచారం ఆధారంగానే భారత్కు వ్యతిరేకంగా ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక కథనం ప్రచురించిందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు.





