
సమాజంలో ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలని కాంక్షిస్తూ ఇస్కాన్ మందిరం (సాగర్నగర్) ఆధ్వర్యంలో నగరంలోని ఆర్కేబీచ్, రుషికొండ తదితర ప్రాంతాల్లో మంగళవారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి సనాతన ధర్మాన్ని బోధిస్తున్న ఇస్కాన్ ఇండియా యూత్ కౌన్సిల్ (ఐఐవైసీ) వార్షిక సమావేశాల్లో భాగంగా భక్తి ప్రచార పరివ్రాజక స్వామి మహరాజు, ఇస్కాన్ (పుణె, హైదరాబాద్) అధ్యక్షులు రాధేశ్యామ్ ప్రభుతో పాటు వందలాది యువ ఆధ్యాత్మిక వేత్తల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే లక్ష్యంతో లోక కల్యాణార్థం ఈ సమావేశాలు గురువారం వరకు నిర్వహిస్తామని ఇస్కాన్ (విశాఖ) అధ్యక్షుడు సాంబాదాస్, మాతాజీ నితాయిసేవిని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణులు, సుభద్ర బలభద్ర, జగన్నాథస్వామి తదితర ఉత్సవ మూర్తులను చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, గీతాలాపనలు, భగవద్గీత ప్రవచనాలు చేశారు.





