ArticlesNews

హిందూపేరుతో దళిత మైనర్‌ను పెళ్ళి చేసుకున్న ముస్లిం, బాలికను అమ్మివేసే ప్రయత్నం

58views

బిహార్‌లోని తూర్పు చంపారన్‌లో లవ్ జిహాద్ కేసు బైటపడింది. సమీర్ ఆలం అనే ముస్లిం వివాహిత యువకుడు హిందూ దళిత బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకుని పెళ్ళి చేసుకుని, నేపాల్‌లో అమ్మివేయడానికి సిద్ధమయ్యాడు. సరైన సమయంలో విషయాన్ని గుర్తించిన ఎస్ఎస్‌బి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు. అతనిపై గతంలోనే అవే నేరాలకు పాల్పడిన ఆరోపణలున్నాయి.

ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్‌లోని నర్కటియాగంజ్ ప్రాంతానికి చెందిన 17ఏళ్ళ హిందూ దళిత బాలికకు సల్మాఖాతూన్ అనే ముస్లిం స్నేహితురాలు ఉంది. హిందూ అమ్మాయి సల్మా ఇంటికి చాలా తరచుగా వెడుతుండేది. సల్మా ఒకసారి ఆ బాలికను ఒక పెళ్ళికి తీసుకువెళ్ళింది. అక్కడ ఆమెకు సమీర్ ఆలంతో పరిచయం ఏర్పడింది. సమీర్ ఆ అమ్మాయితో మాట్లాడడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసాడు. ఆమె వద్దన్నా ఆమె వెంటపడేవాడు. చివరికి ఆమె పాఠశాలకు కూడా వెళ్ళడం మొదలుపెట్టాడు.

కొన్నాళ్ళకు బాధితురాలు సమీర్‌తో మాట్లాడడం మొదలుపెట్టింది. అయితే సమీర్ తాను ముస్లింననే విషయం ఆమెకు తెలియకుండా దాచిపెట్టాడు. పదేపదే ఆమెను తన ఇంటికి రమ్మని పిలిచేవాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా, సుమారు రెండు నెలల తర్వాత ఆ బాలిక అతని మాటలకు మెత్తబడింది. ఒకరోజు పాఠశాల అయిపోయాక అతని ఇంటికి వెళ్ళింది. అక్కడ చాలామంది మహిళలు ఉన్నారు. వారి సమక్షంలో సమీర్ ఆమె నుదుటిపై కుంకుమ పెట్టాడు. వారిద్దరికీ పెళ్ళయిపోయిందని చుట్టూ ఉన్న మహిళలు చెప్పి ఆమెను ఒప్పించారు.

ఆ తర్వాత సమీర్ ఆమెను తన ఇంట్లోనే నిర్బంధించాడు, ఆమెను బైటకు వెళ్ళడానికి వీల్లేదంటూ బలవంతం చేసాడు. రెండుసార్లు ఆమె బైటకు వెళ్ళడానికి ప్రయత్నించినా ఆమెను ఆ ఇంటిలోనివారు నిర్బంధించారు. ఆమె మొబైల్ ఫోన్‌ను కూడా తీసేసున్నారు. ఒకసారి సమీర్ మొబైల్ నుంచి తన ఇంటికి ఫోన్ చేయడానికి ఆమె ప్రయత్నించింది. దానికి ఆమెను తీవ్రంగా కొట్టాడు.

కొన్నాళ్ళకు సమీర్ తన అసలు పథకాన్ని – ఆ బాలికను నేపాల్‌లో అమ్మివేయాలన్న పథకాన్ని – అమలు చేయడానికి సిద్ధపడ్డాడు. ఒకరోజు తనతో పాటు ఆమెను రక్సౌల్ పట్టణంలోని మార్కెట్‌కు తీసుకువెడతానని చెప్పాడు. ఆ వంకన ఇంట్లోనుంచి బైటకు తెచ్చి, నేపాల్‌కు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్‌బి) 47వ బెటాలియన్ ఇనస్పెక్టర్ మనోజ్ కుమార్ శర్మ వారిని చూసాడు. సమీర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఇనస్పెక్టర్ శర్మ సమీర్‌ను విచారించారు. అతని మాటతీరు మరిన్ని అనుమానాలు కలిగించింది. మరోవైపు, ఎంత ప్రశ్నించినా ఆ బాలిక నోరు విప్పలేదు.

ఇనస్పెక్టర్ మనోజ్ శర్మ వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ విచారణ సమయంలో సమీర్ మొబైల్ ఫోన్‌లో ఎన్నో అభ్యంతరకరమైన వీడియోలు, ఫొటోలు దొరికాయి. దాంతో విచారణ ముమ్మరం చేసారు. ఆ క్రమంలోనే, సమీర్ ఆలం గతంలో కూడా, అంటే 2022 మే 11న, ఒక దళిత మైనర్ బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకుని అక్రమ రవాణా చేసి విక్రయించాడన్న విషయం బైటపడింది. అప్పట్లో అతనిపై ప్రతాప్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో, ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదయింది. ఆ కేసు వివరాలను పరిశీలించినప్పుడు, సమీర్‌కు అంతకుముందే పెళ్ళయిందనీ, ఒక సంతానం కూడా ఉందనీ వెల్లడైంది.

విచారణలో భాగంగా సమీర్ ఆలం తన ఉద్దేశాలను బైటపెట్టాడు. బాధిత మైనర్ దళిత బాలికను నేపాల్ తీసుకువెళ్ళి అమ్మేయాలనే ఉద్దేశంలో ఉన్న సంగతిని వెల్లడించాడు. దళిత మైనర్ బాలికను అక్రమ రవాణా చేస్తే జైలుశిక్ష పడుతుంది అని హెచ్చరిస్తే… ‘‘మరేం పర్వాలేదు, నేను మళ్ళీ జైలుకు వెడతాను, తర్వాత బెయిల్ మీద బైటకు వచ్చేస్తాను’’ అని పోలీసులకే చెప్పాడంటే అతనెంత కరడుగట్టిన నేరస్తుడో అర్ధం చేసుకోవచ్చు.

సమీర్ ఆలం చేసిన మోసం బైటపడిన తర్వాత బాధిత మైనర్ దళిత బాలిక అతని చర్యల గురించి తనకు తెలిసిన వివరాలు అన్నింటినీ పోలీసులు, సశస్త్ర సీమా బల్ అధికారులకూ ధైర్యంగా వెల్లడించింది.

చివరికి రక్సౌల్‌కు చెందిన రంజిత్ సింగ్ అనే సామాజిక కార్యకర్త సమీర్ ఆలం మీద పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదు ఆధారంగా సమీర్ ఆలం మీద ఐపీసీ, పోక్సో చట్టం, ఎస్సీ ఎస్టీ చట్టం, బాల్య వివాహ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

ప్రస్తుతం సమీర్ అలీని పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. బాధితురాలి కుటుంబాన్ని గుర్తించారు. ఇప్పుడు కేసు దర్యాప్తు దశకు వచ్చింది.