
జై శ్రీరాం నినాదాలతో ఎడారి దేశం మారుమోగింది.. శ్రీరామనవమి సందర్భంగా ఒమాన్ రాజధాని మస్కట్లో సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. దేశం నలుమూలల నుంచి వందలాది మంది ప్రవాస దంపతులు మస్కట్లోని పురాతన శ్రీకృష్ణ మందిరానికి వేకువ జామునే చేరుకోవడంతో కిక్కిరిసిపోయింది. కాశీ పుణ్యక్షేత్రం నుంచి వచ్చిన కె.నాగశ్రీ నట్వర్లాల్ , స్వామి ఆనఘేశ్వరానంద సరస్వతి ఆధ్వర్యంలో స్థానిక తెలుగు ప్రవాస పురోహితులు, వేదపండితులు సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. భారత రాయబారి అమిత్ నారంగ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. భద్రాచలం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తలంబ్రాలను భక్తులకు అందజేశారు. ఇటు సౌదీ అరేబియాలో తెలుగు ప్రవాస సంఘం ‘సాటా’ ఆద్వర్యంలో రియాధ్ నగరంలో.. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్వర్యంలో ఖతర్లోనూ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దుబాయ్, ఇతర ఎమిరేట్లలో శ్రీరామనవమి వేడుకలను ప్రవాసులు ఇళ్లలోనే జరుపుకొన్నారు.





