
370 ఆర్టికల్ రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి నానా తంటాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. 370 ఆర్టికల్ రద్దుపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ భువనేశ్వర్ కలిటా తన పదవికి రాజీనామా చేశారు.
“మా పార్టీ తీరు ప్రజల అభీష్టానికి, ఆకాంక్షలకు భిన్నంగా వుంది. ఇది నిజంగా ఆత్మహత్యా సదృశం” అని పేర్కొన్న అస్సాంకి చెందిన రాజ్యసభ సభ్యుడు తన రాజీనామాను సమర్పించడం, దానిని రాజ్యసభ చైర్మన్ శ్రీ వెంకయ్య నాయుడు ఆమోదించడం వెంట వెంటనే జరిగిపోయాయి.
భువనేశ్వర్ కలిటాలాగే మరికొందరు కాంగ్రెస్ ఎం.పీలు కూడా ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వైపు 370 ఆర్టికల్ రద్దు సందర్భంగా యావద్దేశ ప్రజలు సంబరాలు జరుపుకుంటూ ఉంటే రాజ్యసభలో కాంగ్రెస్ నాయకులు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబాల్ లు మాత్రం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా విభేదించారు. లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతోపాటు ఇటీవలే కర్ణాటకలో కూడా అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ ఎం.పీ రాజీనామాతో కొత్తగా వచ్చే నష్టం ఉందని అనిపించకపోవచ్చు.
Source : Organiser
https://m.ritam.app/Encyc/2019/8/5/Major-Embarrassment-for-Cong-Party-Chief-whip-in-Rajya-Sabha-resigns.amp.html





