News

విద్యార్థినుల కోసం ‘‘ది కేరళ స్టోరీ’’ని ప్రదర్శించిన చర్చి

204views

`లవ్ జిహాదీ’ ధోరణులను ఎండగడుతూ సంచలనం రేపిన బాలీవుడ్ చిత్రం ‘ది కేరళ స్టోరీ’ని ప్రసారం చేస్తున్న దూరదర్శన్‌పై కేరళలో వామపక్ష ప్రభుత్వం తీవ్ర గందరగోళం సృష్టించిన నేపథ్యంలో కేరళలోని ఒక క్యాథలిక్ డియోసెస్ “ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్”లో భాగంగా టీనేజర్ల కోసం ఈ చిత్రాన్ని ప్రదర్శించడం ఆసక్తి కలిగిస్తుంది.

ప్రముఖ సైరో మలబార్ క్యాథలిక్ చర్చి ఆధ్వర్యంలోని ఇడుక్కి డియోసెస్ 10, 11, 12 తరగతుల్లో చదువుతున్న తమ విద్యార్థుల కోసం గత వారం సినిమాను ప్రదర్శించి, సినిమా గురించి చర్చించి, దాని గురించి సమీక్ష రాయమని కోరింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేరళ నుండి బలవంతంగా ఇస్లాం మతంలోకి మారడానికి వత్తిడులు తెచ్చి, వారు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ లో చేరేవిధంగా చేసిన యువతుల గురించి ఈ సినిమా నిర్మించారు.

ఓ చర్చి ఈ సినిమాను ప్రదర్శించడం పట్ల రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ సంతోషం వ్యక్తం చేస్తూ కేరళలో ఈ సినిమా పట్ల పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని చెప్పారు.కేరళలోని పంచాయితీలు, స్థానిక మునిసిపల్ సంస్థలతో సహా ప్రజలు హృదయపూర్వకంగా ఈ చిత్రాన్ని స్వాగతించారని స్పష్టం చేశారు. ఈ చిత్రం ఇస్లాం మతాన్ని స్వీకరించి, ఐఎస్ లో చేరేందుకు బ్రెయిన్ వాష్ చేసి సిరియాకు పంపిన కేరళకు చెందిన ఒక హిందూ మహిళ కథను వివరిస్తుంది. అటువంటి సినిమాను ప్రదర్శించడంతో వివాదం తలెత్తడంతో డియోసెస్ సోమవారం వివరణ ఇచ్చింది, “ప్రేమ సంబంధాలు, దాని పర్యవసానాలు, ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం” కోసం ఈ చిత్రం ప్రదర్శించిన్నట్లు స్పష్టం చేసింది. డియోసెస్ మీడియా ఇన్‌చార్జి ఫాదర్ జిన్స్ కరక్కట్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెలవుల్లో పిల్లలకు ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమానికి నిర్దిష్టమైన అంశాలను ఎంపిక చేసి పుస్తకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో కార్యక్రమం నిర్వహించామని, 10, 11, 12 తరగతుల పిల్లలకు పాఠ్యపుస్తకాల్లో ఇతివృత్తం ప్రేమ సంబంధాలేనని పూజారి తెలిపారు. ప్రేమలో పడటం, వాటి పర్యవసానాల గురించి అవగాహన కల్పించడం తమ బోధనాంశం ముఖ్య లక్ష్యం అని చెప్పారు.