News

సర్ కార్యవాహగా మరోసారి ఎన్నికైన దత్తాత్రేయ హోసబలే

358views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌ కార్యవాహగా మరోసారి దత్తాత్రేయ హోసబలే మరోసారి ఎన్నికయ్యారు. ఆయన 2027 వరకు ఈ హోదాలో సంఘ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 2021 నుంచి సర్‌ కార్యవాహ బాధ్యతలు నిర్వర్తిస్తున్న హోసబలే, నాగపూర్ వేదికగా జరిగిన మూడు రోజులపాటు జరిగిన అఖిల భారత ప్రతినిధుల సభలో మరోసారి ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు.

2021 వరకు భయ్యాజీ జోషి సర్‌ కార్యవాహగా బాధ్యతలు నిర్వహించారు. హోసబలే నేతృత్వంలోని (2024- 2027) కార్యవర్గంలో ఆరుగురు సహా సర్ కార్యవాహలను నియమించారు. కృష్ణ గోపాల్, ముకుంద్, అరుణ్ కుమార్, రామ్‌దత్త చక్రధర్, అతుల్ లిమయే, అలోక్ కుమార్ సహ కార్యవాహలుగా సేవలు అందించనున్నారు. సమాజంలోని మంచివారంతా ఉమ్మడిగా శ్రమిస్తేనే సామాజికమార్పు సాధ్యమవుతుందని హోసబోలే అన్నారు.

మైనారిటీ అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగించడాన్ని ప్రస్తావించిన హోసబలే, రాజకీయాల్లో మైనారిటీ ధోరణిని సంఘ్ వ్యతిరేకిస్తుందన్నారు. రెండవ సర్ సంఘచాలక్ కాలం నుంచి ముస్లింలు, క్రైస్తవులతో సమన్వయం కోసం పనిచేశారని చెప్పారు. మణిపూర్‌లో ఇటీవలి అల్లర్ల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్, ఘర్షణ కారణంగా నష్టపోయిన మెయితీలు, కుకీలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించామని వివరించారు. ఈ ప్రయత్నాలు దాదాపు సఫలమయ్యాయన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పెద్ద పండుగ వంటివని అభివర్ణించిన హోసబలే, దేశ ప్రజాస్వామ్యాన్ని, ఐక్యతను బలోపేతం చేయడం, ప్రగతి వేగాన్ని కొనసాగించడం ముఖ్యమన్నారు. పోలింగ్ పై ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంసేవకులు ప్రజలను చైతన్య పరచడంలో ముందుంటారన్నారు. శత్రుత్వం, వేర్పాటువాదం లేదా విభజన ప్రయత్నాలు లేదా ఐక్యతకు విరుద్ధమైన అంశాల విషయంలో సమాజం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసత కోసం ఆర్ఎస్ఎస్ పడిన శ్రమ నేడు సమాజంలో కనిపిస్తోందన్నారు.

సామాజిక వివక్ష, అంటరానితనం కొన్నిచోట్ల ఉండటం విచారకరమన్నారు. సరస్సులు, బావులు, దేవాలయాలు, శ్మశాన వాటికల విషయంలో వివక్ష ఉండకూడదని స్పష్టం చేశారు. సందేశ్‌ఖాలీ నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్న మహిళా సంఘాలకు స్వయంసేవకులు, ఇంతర అనుబంధ సంస్థలు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు.

కర్ణాటకలోని షిమోగా, దత్తాత్రేయ హోసబాలే జన్మస్థలం, డిసెంబర్ 1, 1955న జన్మించిన హోసబలే 13 ఏళ్ల వయస్సులోనే 1968లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. 1972లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో చేరారు. బెంగుళూరు విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2002-03లో ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ గా నియామకమయ్యారు. 2009 నుంచి సహా కార్యవాహగా సేవలందించారు. మాతృభాష కన్నడతో పాటు, ఇంగ్లిష్, తమిళం, మరాఠీ, హిందీ, సంస్కృతంతో సహా అనేక భాషాల్లో పరిజ్ఞానం ఉంది. ఎమర్జెన్సీ సమయంలో 14 నెలల పాటు మిసా ఖైదీగా జైలులో గడిపిన దత్తాత్రేయ హోసబాలే 1975-77లో జేపీ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు.