
361views
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఏటా అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం చరిత్రాత్మకమని కేంద్ర హోంమంత్రి అమిత్షా సామాజిక మాధ్యమం ఎక్స్లో బుధవారం పేర్కొన్నారు. ‘‘నాటి ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్మారకార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. దారుణమైన నిజాం పాలన నుంచి విముక్తి కల్పించి హైదరాబాద్ ప్రాంతాన్ని భారతదేశంలో భాగంగా ఉంచేందుకు సర్వోన్నత త్యాగాలు చేసిన స్వాతంత్య్ర సమరయోధులకు, అమరవీరులకు సముచిత నివాళి అర్పించడానికే ఈ నిర్ణయం. యువతలో దేశభక్తి జ్వాల రగిలించి, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలను చిరస్థాయిగా నిలిపేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది’’ అని అమిత్షా పేర్కొన్నారు.





