
దేశంలో రూపొందిన అతిపెద్ద సర్వే నౌక ఐఎన్ఎస్ సంధాయక్ భారత నౌకాదళంలో చేరింది. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) సంస్థ దీన్ని నిర్మించింది. ఈ శ్రేణిలోని నాలుగు సర్వే నౌకల్లో ఇది మొదటిది. దీన్ని 2021 డిసెంబరు 5న జలప్రవేశం చేయించారు. అప్పటి నుంచి దీనిపై సముద్ర పరీక్షలు జరిగాయి. నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఈ నౌకను లాంఛనంగా నేవీ చేతికి అప్పగించినట్లు జీఆర్ఎస్ఈ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఐఎన్ఎస్ సంధాయక్ పొడవు 110 మీటర్లు. ఇది తీర ప్రాంతంలో, సాగరంలో హైడ్రోగ్రఫిక్ సర్వేలను నిర్వహించగలదు. నేవిగేషన్ మార్గాల నిర్ధారణకూ సాయపడగలదు. రక్షణ అవసరాల కోసం సముద్ర, భౌగోళిక డేటాను సేకరించగలదు. చిన్నస్థాయి పోరాటాల్లో పాలుపంచుకోగలదు. అవసరమైతే ఆసుపత్రి నౌకగానూ సేవలు అందిస్తుంది. విపత్తుల సమయంలో బాధితులను ఆదుకోవడంలో సాయపడగలదు. ఈ నౌకపై ఒక హెలికాప్టర్ను మోహరిస్తారు.





