
నేడు అరుదైన సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. పాక్షికమే అయినప్పటికీ.. వలయాకార గ్రహణం కావడంతో రింగ్ ఆఫ్ ఫైర్ కనువిందు చేయనుంది. నేటి రాత్రి 08గం. 34ని. నుంచి అక్టోబర్ 15 తెల్లవారుజామున 02గం.52 ని. వరకు గ్రహణం ఉండనుంది. అయితే.. సూర్యాస్తమయం తర్వాత ఏర్పడే గ్రహణం కాబట్టి భారత్లో ఇది కనిపించదు.
దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఆయా దేశాల ప్రజలు మాత్రమే పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలరు. అయితే.. రింగ్ ఆఫ్ ఫైర్ను నేరుగా వీక్షించడం మంచిదికాదని ఇప్పటికే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో పాటు కెనడా, నికరాగ్వా, బ్రెజిల్, కొలంబియా, కోస్టారికా, అర్జెంటీనా, హోండురస్, పనామా దేశాల ప్రజలు ఈ సూర్య గ్రహణాన్ని చూడగలరు.
భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఆ నీడ సూర్యుడ్ని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేయడం సూర్యగ్రహణం.. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు ఆ నీడ చంద్రుడిపై పడితే చంద్రగ్రహణం ఏర్పడతుంది. ఇది అమావాస్య, పౌర్ణమి రోజుల్లోనే జరుగుతుంది. అయితే, ప్రతీ అమావాస్య, పౌర్ణమికి గ్రహణాలు ఏర్పడవు.





