News

డిసెంబరు 13 నుంచి భద్రాద్రిలో శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు

313views

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో డిసెంబరు 23న ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వారంలో పూజలు ఉంటాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. అదే నెల 13 నుంచి శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అదే రోజున మత్స్యావతార దర్శనం, 14న కూర్మావతారం, 15న వరాహావతారం, 16న నరసింహావతారం, 17న వామనావతారం, 18న పరశురామావతారం, 19న శ్రీరామావతారం, 20న బలరామావతారం, 21న శ్రీకృష్ణావతారం, 22న శ్రీ తిరుమంగైలపై అళ్వారుల పరమ పదోత్సవం ఉంటుందని వివరించారు.

జనవరి 12న కూడారై ఉత్సవం, 14న భోగిని పురస్కరించుకుని శ్రీ గోదాదేవి కల్యాణం, 15న మకర సంక్రాంతి సందర్భంగా రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 13 నుంచి 23 వరకు నిత్య కల్యాణాలను నిలిపివేయనున్నారు. అలాగే, డిసెంబరు 17 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస పూజలు ఉంటాయని ఈవో రమాదేవి తెలిపారు.