News

శరణార్థి పాలసీని దుర్వినియోగం చేస్తున్న ఖలిస్తానీవాదులు

300views

ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం ఇంకా వేట కొనసాగిస్తున్నారు పంజాబ్ పోలీసులు. ఈ విషయం తెలిసిన విదేశాల్లోని ఖలిస్తానీవాదులు భారత రాయబార కార్యాలయాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. ముఖ్యంగా యూకే, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఖలిస్తానీవాదులు భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తూ.. భారత ఎంబసీ, కాన్సులేట్స్ పై దాడులు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ముఖ్యంగా యూకే రాజాధాని లండన్ లో ఏకంగా భారతీయ జెండాను కిందికి దించి భారత హైకమిషన్ ముందు ఖలిస్తానీ జెండాను ఎగరేసేందుకు ప్రయత్నించడంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ఇదిలా ఉంటే యూకే శరణార్థి పాలసీని ఖలిస్తానీ మద్దతుదారులు దుర్వినియోగం చేస్తున్నారని ఆ దేశానికి భారత్ తేల్చి చెప్పింది. యూకే ఆశ్రయం ఇస్తున్న విధానం భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి వీలు కల్పిస్తోందని భారత హోం మంత్రిత్వ శాఖ, యూకే హోం మంత్రిత్వశాఖ మధ్య జరిగిన చర్చల సందర్భంగా చెప్పింది. యూకే ఆధారిత ఖలిస్తానీ మద్దతుదారులపై కఠిన పర్యవేక్షణ, క్రియాశీల చర్యలను తీసుకోవాలని భారత్ కోరింది.

లండన్ లోని భారత రాయబార కార్యాలయం పై దాడిలో పాల్గొన్న చాలా మంది అక్కడ రాజకీయ ఆశ్రయం పొందుతున్నారని, ఈ విషయాన్ని యూకే తెలియజేసినట్లు భారత అధికారులు తెలిపారు. ఖలిస్తాన్ అంశంతో పాటు ఉగ్రవాద వ్యతిరేక, సైబర్ సెక్యూరిటీ, మాదకద్రవ్యాల నివారణ, నేరస్తుల అప్పగింతపై సహకారాన్ని ఇరు పక్షాలు సమీక్షించాయి. చర్చల్లో భారత ప్రతినిధి బృందం తరపున హోం కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా పాల్గొన్నారు. బ్రిటన్ నుంచి హోం ఆఫీస్ శాశ్వత కార్యదర్శి సర్ మాథ్యూ రైక్రాఫ్ట్ పాల్గొన్నారు.