
టర్కీ, సిరియాలో భూకంపం బీభత్సం సృష్టించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. భూప్రకంపనల ధాటికి పలు భవనాలు సెకన్ల వ్యవధిలో పేకమేడల్లా కూలిపోయాయి. టర్కీ, సిరియాలో భవనాలు కూలి 1300 మందికి పైగా మృతి చెందారు. టర్కీలోని నుర్దంగికి 23 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఈ ఊహించని ఉపద్రవంతో టర్కీ, సిరియా శోకసంద్రంలో మునిగిపోయాయి. ఎటుచూసినా యుద్ధం అనంతరం కనిపించే దృశ్యాలు భూకంపం మిగిల్చిన పెను విషాదానికి సాక్ష్యంగా నిలిచాయి.
సామాజిక మాధ్యమాలలో భూకంపానికి సంబంధించిన వందల వీడియోలు దర్శనమిస్తున్నాయి. భవనాలు కూలిన దృశ్యాలను కళ్లకు కట్టాయి. భూకంపం కారణంగా కూలిన శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం తెల్లవారుజామున ఇతర దేశాల ప్రజల జీవనం రోజూలానే మొదలు కాగా సిరియా, టర్కీ ప్రజలు మాత్రం భూప్రకంపనలతో బెంబేలెత్తిపోయారు. భూకంపం సృష్టించిన కల్లోలానికి వందల మంది చనిపోగా, వేల మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికే తీవ్రమైన చలికి అల్లాడిపోతున్న టర్కీ ప్రజలు భూకంపం దెబ్బకు ‘బతుకు జీవుడా’ అంటూ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కళ్ల ముందు నివాసాలు కూలిపోతుంటే నిట్టూర్చుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నిల్చున్న పరిస్థితి టర్కీ, సిరియా ప్రజలది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. టర్కీలో ఈ స్థాయిలో భూకంపం విరుచుకుపడటానికి కారణం లేకపోలేదు.
ప్రపంచంలోనే భూకంపం సంభవించేందుకు ఎక్కువ అవకాశమున్న ప్రాంతం టర్కీ. ఈ దేశంలోని ఎక్కువ ప్రాంతం Anatolian Tectonic Plate పై విస్తరించి ఉంది. ఈ కారణంగా టర్కీ ప్రజలను భూకంప భయం ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. 1999లో కూడా టర్కీలో భూకంపం వేల మందిని పొట్టనపెట్టుకుంది. 1999లో టర్కీలోని ఇజ్మిత్ నగరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైంది. ఆ సమయంలో దాదాపు 17వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం టర్కీలోని గాజియాన్తెప్ నగరం భూకంప తీవ్రతకు విలవిలలాడిపోయింది. ఈ నగరంలో ఏ ఒక్కరూ ఇళ్లలో లేకుండా వీధుల వెంట పరుగులు తీశారంటే పరిస్థితి ఎంత హృదయవిదారకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా టర్కీలో సంభవించిన భూకంపాల్లో ఇదే అత్యంత తీవ్రత కలిగిన భూప్రకంపన అని అక్కడి అధికారులు తెలిపారు.
ఈ భూకంప తీవ్రతకు టర్కీలోని భూమి 40 సార్లుకు పైగా కంపించిందని వెల్లడించింది. సిరియా శరణార్థులకు ప్రపంచంలోని ఏ ఇతర దేశం టర్కీ మాదిరిగా ఆశ్రయం కల్పించలేదు. టర్కీలో మొత్తం 3.7 మిలియన్ల మంది సిరియా శరణార్థులు జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. తీవ్ర ఉపద్రవంతో విలవిలలాడిపోతున్న టర్కీకి సాయం చేసేందుకు ఇజ్రాయెల్ ముందుకొచ్చింది. ఈ పరిణామంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు. టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా జరిగిన ప్రాణ నష్టం తీవ్రంగా కలచివేసిందని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టర్కీకి భారత్ అండగా నిలుస్తుందని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
భారీ భూకంపంతో టర్కీ అతలాకుతలమైన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే సహాయక, మెడికల్ బృందాలను టర్కీ పంపాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీయడంతో పాటు సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను టర్కీ పంపిస్తున్నారు. అలాగే క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని కూడా టర్కీ పంపిస్తున్నారు. గాయపడిన వారికి అవసరమైన ఔషధాలు, ఇతర సహాయక సామాగ్రి కూడా ఈ బృందాలు భారత్ నుంచి తీసుకెళ్తున్నాయి. ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందంలో కనీసం వందమంది సిబ్బంది ఉంటారని వీరు టర్కీ ప్రభుత్వంతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. డాగ్ స్క్వాడ్ కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్తో వెళ్తోంది. మెడికల్ బృందాల్లో శిక్షణ పొందిన డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఔషదాలు, ఇతర సహాయ సామాగ్రి కూడా తీసుకెళ్తున్నారు. టర్కీ ప్రభుత్వంతో పాటు అంకారాలోని భారత ఎంబసీతో పాటు ఇస్తాంబుల్లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయంతో భారత బృందాలు సమన్వయం చేసుకుంటాయి.





