News

శ్రీరాముడిపై కర్ణాటకకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు!

253views

కర్ణాటక రాష్ట్రానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ కేఎస్ భగవాన్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘శ్రీరాముడు తాగుబోతు, సీతా దేవిని అడవులకు పంపించాడు, ఆమెను పట్టించుకోలేదు’ అని అన్నారు. వాల్మీకి రామాయణంలోని ఉత్తర కాండ ప్రకారం, శ్రీరాముడు ఆదర్శప్రాయుడైన రాజు కాదని, కేవలం 11 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడని చెప్పారు.

ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం… విశ్రాంత ప్రొఫెసర్ కేఎస్ భగవాన్ కర్ణాటకలోని మాండ్య జిల్లాకు చెందినవారు. ఆయన ఇటీవల ఓ వేదికపై మాట్లాడుతూ.. రామరాజ్యాన్ని నిర్మిస్తామని కొందరు చెబుతున్నారు. వాల్మీకి రామాయణంలోని ఉత్తర కాండను ఎవరైనా చదివితే, రాముడు ఆదర్శప్రాయుడు కాదని స్పష్టమవుతుందన్నారు. ఆయన 11,000 సంవత్సరాలు పరిపాలించలేదని, కేవలం 11 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారని తెలుస్తుందన్నారు. రాముడు సీతతో మధ్యాహ్నం కూర్చుంటాడని, మిగిలిన రోజంతా తాగుతూ గడుపుతాడని వెల్లడవుతుందని చెప్పారు. ఆయన తన భార్య సీతను అడవులకు పంపించాడని, ఆమెను పట్టించుకోలేదని అన్నారు. శూద్రుడైన శంభూకుడు ఓ చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉంటే, దారుణంగా అతని తలను నరికేశాడని చెప్పారు. అలాంటి రాముడు ఆదర్శప్రాయుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు.

గతంలోనూ ఇలాగే..
ప్రొఫెసర్ భగవాన్ గతంలో కూడా హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన రాసిన ‘Rama Mandira Yeke Beda’ పుస్తకాన్ని కర్ణాటక బుక్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసినప్పటికీ, పెద్దఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఆ నిర్ణయాన్ని కమిటీ వెనక్కు తీసుకుంది.