
ఎయిరిండియా విమానంలో మూత్రవిసర్జన చేసిన వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎయిరిండియాపై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కఠిన చర్యలకు ఉపక్రమించింది. నిబంధనల అతిక్రమణకు పాల్పడినందుకుగానూ ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. విధుల్లో ఉన్న సమయంలో జరిగిన ఘటనను అధికారికంగా తెలియజేయని కారణంగా ఆ విమాన పైలెట్-ఇన్-కమాండ్ లైసెన్స్ను మూడు నెలలపాటు రద్దు చేస్తున్నట్టు డీజీసీఏ ప్రకటించింది. అంతేకాకుండా ఎయిరిండియా డైరెక్టర్-ఇన్-ఫ్లైట్ సర్వీసెస్కు రూ.3 లక్షల జరిమానా విధిస్తున్నట్టు వెల్లడించింది.
న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో డెబ్బై ఏళ్ల మహిళా ప్రయాణికురాలిపై శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం మత్తులో మూత్రవిసర్జన చేసిన విషయం తెలిసిందే. ఫ్లైట్లోని బిజినెస్ క్లాస్లో ప్రయాణికుల భోజనం ముగిశాక లైట్లు ఆర్పివేసిన అనంతరం తాగుబోతు ఈ బరితెగింపు చర్యకు పాల్పడ్డాడు. ఇది నవంబరు 26న జరగ్గా బాధితురాలు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. సిబ్బంది తీరు పట్ల నిరాశ చెందిన బాధితురాలు.. న్యాయం కోసం ఎయిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్కు లేఖ రాసింది. ఆ తర్వాతే ఘటనపై ఎయిర్ ఇండియా కళ్లు తెరిచి నిందితుడిపై చర్యలకు ఉపక్రమించారు.