News

వకుళమాత ఆలయంలో చోరీకి యత్నం.. కానీ ఒక్క రూపాయి కూడా దొంగిలించలేదు.. ఎందుకో తెలుసా?

342views

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్న వకుళామాత ఆలయంలో బుధవారం చోరీ యత్నం జరిగింది. ఆలయం వెనుక వైపున ఉన్న కొండఎక్కి గుడిలోకి ఓ దొంగ చొరబడ్డాడు. ప్లాన్‌ ప్రకారం లోనికి వచ్చి.. గడ్డపార తీసుకుని హుండీ తాళాలు పగలగొట్టాడు. హుండీలోని నగదును మొత్తం మూటగట్టుకున్నాడు. అంతా సర్దేసిన తర్వాత ఇక బయల్దేరదామనుకున్నాడు… కానీ ఆ వెంకటేశ్వరుడి మహిమే లేదా ఇంకేమైనా జరిగిందో తెలియదు.. చోరీ చేసిన సొమ్ముతో ముందుకెళ్లలేకపోయాడు. హుండీలోని నగదును మూటగట్టి తప్పించుకునే ప్రయత్నంలో ఆ మూట కిందపడిపోయింది. మూట కిందపడిన అలికిడి కావటంతో అక్కడున్న వారు నిద్రలేస్తారనే భయంతో మూటవదిలి ఉత్త చేతులతో పరారయ్యాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరా‌లో నమోదయ్యాయి.

ఆలయ అధికారులు చోరీ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సాయంతో దొంగను గుర్తించే పనిలో పడ్డారు. నగదు మూటను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

గత కొన్ని సంవత్సరాలకు ముందు వరకూ వకుళామాత ఆలయంలో గంట కొట్టిన తర్వాతనే శ్రీవారికి నైవేథ్యం పెట్టేవారని ప్రసిద్థి. పాత ఆలయం శిథిలావస్థకు చేరటంతో దాని స్థానంలో కొత్త ఆలయాన్ని నిర్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన ఈ వకుళామాత గుడిలో చోరీ జరగడంతో వార్తల్లో నిలిచింది.