News

నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపురలో మోగిన ఎన్నికల నగారా.. తేదీలు ఎప్పుడెప్పుడంటే?

313views

మూడు ఈశాన్య రాష్ట్రాల శాసన సభల ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషన్ బుధవారం షెడ్యూలు ప్రకటించింది. నాగాలాండ్ శాసన సభ పదవీ కాలం మార్చి 12తోనూ, మేఘాలయ మార్చి 15తోనూ, త్రిపుర శాసన సభ పదవీ కాలం మార్చి 22తోనూ ముగియనుంది. త్రిపురలో ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది. నాగాలాండ్‌ను నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ పరిపాలిస్తోంది. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది. జాతీయ గుర్తింపు పొందిన ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఏకైక పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ కావడం గమనార్హం. నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపురలలో 60 శాసన సభ స్థానాలు చొప్పున ఉన్నాయి. త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మేఘాలయలో ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంటుందని తెలిపింది. నాగాలాండ్‌లో కూడా ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని తెలిపింది.

ఫలితాలు ఎప్పుడంటే..

ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (Chief Election Commissioner Rajiv Kumar) బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ శాసన సభల ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయలలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడతాయని చెప్పారు.

ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదులకు సీవిజిల్ యాప్ (cVigil app) ద్వారా ఎన్నికల కమిషన్‌ (ECI)కి తెలియజేయవచ్చునని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోనే స్పందిస్తామని చెప్పారు. ప్రలోభాలు లేకుండా ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.