News

నేపాల్ విమాన ప్రమాదంలో మొత్తం 72మంది మృతి… కూలడానికి కొన్ని సెకన్ల ముందు ఏం జరిగిందంటే?

272views

నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం జనవరి 15వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్-72 విమానం పొఖారా ఎయిర్ పోర్ట్ లో ల్యాండవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. సేతి గండకి నది పరీవాహక ప్రాంతంలోని అటవీ ప్రదేశంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ నది పాత డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు, పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం మధ్యలో ప్రవహిస్తోంది. ఈ విమానం నేపాల్ రాజధాని కాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది.

ప్రమాద సమయంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది విమానంలో ఉన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ కూలిన వెంటనే పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో దానిలో ఉన్న అందరూ మంటల్లో కాలి ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయినవారిలో 53 మంది నేపాలీలు, అయిదుగురు భారతీయులు, నలుగురు రష్యన్‌ లు, ఇద్దరు కొరియన్‌ లు, ఇద్దరు ఐర్లాండ్‌ కు చెందినవారు, ఆఫ్ఘనిస్థాన్‌, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం 32 మంది మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అయితే విమానం కుప్పకూలిపోవడానికి ముందు తన దిశను కోల్పోయినట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. కుప్పకూలిపోవడానికి కొద్ది సెకండ్ల ముందు ఆ విమానం తలక్రిందులవుతున్నట్లుగా ఒరిగిపోవడం వీడియోలో కనిపించింది. విమానాశ్రయానికి సమీపంలోని ఓ బిల్డింగ్పై నుంచి ఓ వ్యక్తి ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రమాదం నేపథ్యంలో నేపాలీ ప్రభుత్వం అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే పొఖారో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు.