
భారత్లోని సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటు చేసిన కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య వివాదం ఇప్పుడల్లా సద్దుమణిగేలా లేదు. సుప్రీంకోర్టు తీసుకొచ్చిన కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్కు ఇటీవల లేఖ రాశారు. ఈ విధంగా న్యాయమూర్తులను నియమించడం వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక కేంద్ర న్యాయశాఖ మంత్రి రాసిన లేఖపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. ఇది ప్రమాదకరమని, న్యాయ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తదితరులు అభిప్రాయపడ్డారు. మరోవైపు నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం నడుస్తున్న కొలీజియం వ్యవస్థను కొనసాగించడాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తోంది.
కొలీజియం వ్యవస్థ అంటే?
దేశంలో 1993వ సంవత్సరం నుంచి న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం విధానం అమల్లో ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ఈ వ్యవస్థలో భాగంగా ఉంటారు. వీరు పలు కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించిన విషయాలను చూస్తారు. వీరు కొన్ని పేర్లు ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. వారు వాటిని పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే లిస్టులో ఉన్న పేర్లను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినా.. రెండో సారి కొలీజియం అవే పేర్లను ప్రతిపాదిస్తే మాత్రం వాటిని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఆమోదించాల్సిందే. న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం తర్వాత రాష్ట్రపతికి ఆ లిస్టు పంపుతారు. ఈ కొలీజియం వ్యవస్థకు రాజ్యాంగంలో ఎలాంటి మార్గదర్శకాలు లేవు.
తెరపైకి వస్తున్న నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్..
కొలీజియం వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా 2014లో 99వ రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కొలీజియం వ్యవస్థను తొలగించి న్యాయమూర్తులను నియమించేందుకు ఈ కమిషన్ను ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించారు. అయితే న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని ఈ కమిషన్ నేరుగా పెంచుతుంది. ఇందులో సీజేఐ నేతృత్వంలోని ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులతోపాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి, పౌర సమాజానికి చెందిన ఇద్దరు వ్యక్తులను నామినేట్ చేయవచ్చు. ఇద్దరు నామినేటెడ్ సభ్యుల్లో ఒకరిని సీజేఐ, ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా నియమిస్తారు. అదే సమయంలో రెండో నామినేటెడ్ సభ్యుడు ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ మైనారిటీ కమ్యూనిటీ లేదా మహిళలు ఉంటారు. ఈక్రమంలో 2015లో సుప్రీంకోర్టు ఎన్జేఏసీ చట్టవిరుద్ధమని ప్రకటించి.. కొలీజియం వ్యవస్థను తీసుకొచ్చింది.
కొలీజియం వ్యవస్థను రద్దు చేయవచ్చా?
కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం పార్లమెంటు, లోక్ సభ, రాజ్యసభ ఉభయ సభల్లో జరిగే ఓటింగ్ లో కేంద్ర ప్రభుత్వానికి మూడింట రెండొంతుల ఎంపీల మెజారిటీ రావాలి. దీంతోపాటు ఈ సవరణకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల మద్దతు కూడా అవసరం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి ఇది సాధ్యం కాదని చెప్పవచ్చు.





