
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పంజాబ్ లోని ఫిలౌర్ వద్ద యాత్ర చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో ఆయనను అంబులెన్సులో తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనతో రాహుల్ గాంధీ యాత్రను ఆపేసి ఆసుపత్రికి వెళ్లారు. ఈ ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
సంతోఖ్ సింగ్ మృతిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ”ఈ వార్త విని షాకయ్యాను. పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయింది. సంతోఖ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని తెలిపారు.
సంతోఖ్ సింగ్ 1946 జూన్ 198న జలంధర్ లోని దలివాల్ ప్రాంతంలో జన్మించారు. ఈయన పంజాబ్ కాంగ్రెస్ హయాంలో కేబినెట్ మంత్రిగా కూడా పని చేశారు. 2014,2019లో జలంధర్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి రెండు సార్లు గెలుపొందారు. ఎంపీ మృతి పట్ల పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. అతని కుటుంబానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.





