
భారత సరిహద్దుల్లో వాతావరణం భారత్కు అనుకూలంగానే ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. చైనాతో ఇప్పటికే చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. అయితే… ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా భారత్ ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉందని ధీమాగా చెప్పారు. జనవరి 15న సైనిక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన సందర్బంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని.. కానీ ఇండియన్ ఆర్మీ మాత్రం దేనికైనా రెడీగా ఉంటుందని స్పష్టం చేశారు. చైనాతో మనకు 7 రకాల సమస్యలున్నాయని.. ఇందులో దాదాపు 5 సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకున్నామన్నారు. మిలిటరీ కమాండర్ల స్థాయిలో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని.. ఎలాంటి పరిస్థితి వచ్చినా పోరాడేందుకు సరిపడ సామగ్రి తమ వద్ద సిద్ధంగా ఉందన్నారు.
పాకిస్థాన్పై విరుచుకుపడిన ఆర్మీ చీఫ్…
పాకిస్థాన్పై విరుచుకుపడ్డారు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే విరుచుకుపడ్డారు. కావాలనే పాక్ టార్గెట్ కిల్లింగ్స్కు పాల్పడుతోందని విమర్శించారు. ఇటీవల జరిగిన రాజౌరీ ఘటనను ప్రస్తావిస్తూ దాయాదిపై మండిపడ్డారు. పాకిస్థాన్ టార్గెట్ కిల్లింగ్కు పాల్పడుతోందని.. పిర్ పంజాల్ రేంజ్లో మైనార్టీలు లక్ష్యంగా దాడులు చేస్తోందన్నారు. ఇదే ప్రాంతంలో పాకిస్థాన్ సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకు రావడానికి పదేపదే ప్రయత్నిస్తున్నాయన్నారు. బీఎస్ఎఫ్తోపాటు ఆర్మీ కూడా ఈ చొరబాటును అడ్డుకుంటున్నాయని తెలిపారు. డ్రోన్ల సాయంతో నిలువరిస్తున్నామని వివరించారు. శత్రు దేశ డ్రోన్లు మనవైపు రాకుండా జామర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. మునుపటితో పోల్చుకుంటే హింసాత్మక ఘటనలు కొంతమేర తగ్గాయన్నారు.





