News

సికింద్రాబాద్ -విజయవాడ మధ్య ఆర్‌ఆర్‌టీఎస్ రైలు!

351views

అత్యాధునిక సాంకేతిక సదుపాయాలను ఉపయోగించుకుంటూ.. అత్యంత వేగంగా నడిచే రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. హైదరాబాద్‌ – సికింద్రాబాద్‌ జంట నగరాల్లో నడిచే మెట్రో రైళ్ల మాదిరిగా… సికింద్రాబాద – విజయవాడ పట్టణాల నడుమ ఆర్‌ఆర్‌టీఎస్ రైళ్లను నడపాలని భావిస్తోంది.

ఇప్పటికే వందే భారత్ రైళ్లను వరుసగా ప్రవేశ పడుతున్న రైల్వే శాఖ.. వీటికన్నా వేగంగా నడిచే ఆర్‌ఆర్‌టీఎస్ రైలు వ్యవస్థను అందుబాటులోకి త్వరలో తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం ఈ రైళ్లను ప్రయోగాత్మకంగా ఢిల్లీ-మీరట్ మధ్య నడుపుతున్నారు. కనీసం 2024 నాటికైనా ఆర్‌ఆర్‌టీఎస్‌ రైలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరో ఏడు నగరాలకు సైతం ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ఆలోచనతో, సిక్రిందాబాద్-విజయవాడ మధ్య కూడా ఆర్‌ఆర్‌టీఎస్ లైన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. వీటి నిర్మాణానికి సుమారు 340 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుంది.

2024 నాటికి డిపిఆర్ ను అందుబాటులోకి తెచ్చే విధంగా తయారు చేస్తున్నారు. ఈ ఆర్‌ఆర్‌టీఎస్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ఆర్ఆర్‌టీఎస్ అంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం. ఇప్పటికే అనేక దేశాలలో ఇటువంటి వ్యవస్థ అందుబాటులో ఉంది. రైల్వేశాఖతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆర్‌ఆర్‌టీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. మొదటగా 1998-99లో ఈ రైలుమార్గం ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకురాగా, ఇప్పుడు కార్యరూపం దాల్చనున్నది.
ఇప్పటికే ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ రైలును ప్రవేశపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు.