News

కుంగిపోతున్న జోషీమఠ్‌.. 600 ఇళ్లకు పగుళ్లు.. తరలిపోతున్న ప్రజలు!

378views

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా జోషీమఠ్‌ నగరంలో భూమి కుంగిపోవడం తీవ్ర కలకలం రేపింది. భూమి కుంగిపోవడం వల్ల సుమారు 600 ఇళ్లకు పెద్దపెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరికొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఎన్టీపీసీ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా రోజుల నుంచి ఇలా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు గత అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి కాగడాలతో నిరసన తెలిపారు.

బద్రినాథ్‌, హమ్‌కుండ్‌ క్షేత్రాలకు వెళ్లే మార్గంలో ఉన్న ఈ ప్రాంతంలో భూమి కుంగి పోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. భూమి కుంగి.., ఇళ్లకు పగుళ్లు రావడం వల్ల సుమారు 60 కుటుంబాలు జోషీమఠ్‌ను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోగా.. గురువారం ఉదయం 29 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 500 కుటుంబాలు అక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాయని తెలుస్తోంది. ఇల్లు పగుళ్లు ఇచ్చినప్పటికీ తమకు మరో మార్గం లేక ఇక్కడే ఉంటున్నట్లు వారు తెలిపారు. భూమి కుంగిపోవడం వల్ల 3,000 మంది ఇబ్బందులు పడుతున్నట్లు మున్సిపల్‌ అధికారులు కూడా తెలిపారు.

కారణాలు తెలుసుకుంటున్న అధికారులు..
జోషీమఠ్‌లో భూమి కుంగిపోవడానికి కారణాలను తెలుసుకునేందుకు ఐఐటీ రూర్కీతోపాటు పలు సంస్థల నిపుణులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశోధనలు చేస్తున్నారు. ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు కూడా జోషీ మఠ్‌ వెళ్లి సహాయ చర్యలు చేపట్టాయి. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ కూడా జోషీమఠ్‌ వెళ్లి, పగుళ్లను పరిశీలించనున్నారు. నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని ఆయన దెహ్రాదూన్‌లో తెలిపారు.