
కరోనా ప్రభలిన సమయంలో అప్పటి అవసరాలకు అనుగుణంగా అధిక వేతనాలు ఇచ్చి అనేకమందిని టెక్నాలజీ సంస్థలు ఉద్యోగాలు కల్పించాయి. ఇక ఇప్పుడు గిరాకీ తగ్గడంతో సాధ్యమైనంత మేర … ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నిస్తు న్నాయి. పనికంటే ఎక్కువ వేతనం పొందుతున్నారని భావిస్తున్న వారితోపాటు, పనితీరు సంతృప్తికరంగా లేనివారు వేటుకు గురవుతున్నారు.
కరోనా సమయంలో ఇలా..
కరోనా సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమైన తరుణంలో అన్ని సంస్థలు తమ కార్యకలాపాలను డిజిటలీకరణ చేసుకున్నాయి. ఈ- కామర్స్ కొనుగోళ్లు అధికంగా జరిగాయి. సామాజిక మాధ్యమాలు యూట్యూబ్లో వీడియోలను ప్రజలు ఎక్కువగా తిలకించారు. ఆన్లైన్లో పాఠ్యాంశాలు బోదించే ఎడ్యుటెక్ సంస్థలకూ అమిత డిమాండ్ ఏర్పడింది. దీంతో సాంకేతిక నిపుణులకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఇందువల్లే అంతర్జాతీయ సంస్థలైన మెటా, గూగుల్, అమెజాన్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ లాంటి వాటితో పాటు దేశీయంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు తమకు వచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నాయి. బైజూస్ వంటి చిన్న సంస్థలూ ఈ విషయంలో వెనకడుగువేయలేదు. 2022లో ప్రపంచ వ్యాప్తంగా 1013 సంస్థలు 1,51,100 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఓ సర్వే సంస్థ వెల్లడించింది. కొవిడ్ ప్రారంభం నుంచి చూస్తే దాదాపు 1530 సంస్థలు 2,40,151 మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొంది. అధిక తొలగింపులు కన్జ్యూమర్, రిటైల్ రంగంలోనే ఉన్నాయి.
లాభాలు తగ్గడంతో..
టెక్ రంగం 2012లో ఒక్కసారిగా డీలాపడింది. అమెరికాలోని అయిదు అతిపెద్ద కంపెనీల ఆదాయం బాగా తగ్గింది. ఆర్థిక మాంద్యం చాయలు కనిపిస్తుండటంతో, సాధ్యమైనంత తొందరగా ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. 2022లో మెటా 11,000, అమెజాన్ 10,000, సిస్కో 4100 ఉద్యోగులను తొలగించినట్లు సర్వే చేసిన సంస్థ వెల్లడించింది. ట్విటర్ సిబ్బందిలో దాదాపు 75% మందిని నూతన యజమాని ఎలాన్ మస్క్ ఇంటికి పంపించినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.





