News

ప్రజాస్వామిక చర్చల తర్వాతే ఉమ్మడి పౌరస్మృతి: అమిత్‌ షా

96views

న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. అయితే, ప్రజాస్వామిక ప్రక్రియలో, అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. గురువారం టైమ్స్‌ నౌ  చానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

భారతీయ జన్‌సంఘ్‌ కాలం నుంచీ ఉమ్మడి పౌరస్మృతి అమలు తమ డిమాండ్‌ అని ఆయన గుర్తుచేశారు. రాజ్యాంగ సభ కూడా ఏదో ఒక సమయంలో దీనిని అమలు చేయాలని పార్లమెంటు, అసెంబ్లీలకు సిఫారసు చేసిందని పేర్కొంటూ అయితే ఆ తర్వాత ఆ విషయాన్ని విస్మరించారని ఆక్షేపించారు. బీజేపీ తప్ప ఏ పార్టీ కూడా పౌరస్మృతికి అనుకూలంగా లేదని పేర్కొన్నారు.

దీనిపై ప్రజాస్వామికంగా ఆరోగ్యకరమైన చర్చ జరగాలని అమిత్ షా ఆకాంక్షించారు. ఉమ్మడి పౌరస్మృతిపై హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తుల సారథ్యంలో కమిటీలు వేశారని చెబుతూ అన్ని వర్గాలూ తమ అభిప్రాయాలను వాటికి తెలియజేస్తున్నాయని తెలిపారు.

లౌకికవాద దేశంలో చట్టాలు మత ప్రాతిపదికన ఉండరాదని అభిప్రాయపడ్డారు. కుల వాదం, వారసత్వం, బుజ్జగింపు విధానాల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజకీయాలను విముక్తి చేశారని హోమ్ మంత్రి కొనియాడారు. పనితీరు ఆధారిత రాజకీయాలను ప్రారంభించారని చెబుతూ ఎవరు బాగా పనిచేస్తే వారే దేశాన్ని పాలిస్తారని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి