
భాగ్యనగరం: ప్రముఖుల నివాళులు, అభిమానుల అశ్రునయనాల నడుమ సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం సాయంత్రం 3.30 గంటలకు జూబ్లీహిల్స్లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. కృష్ణ కుమారుడు మహేశ్బాబు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
కృష్ణ పార్థివదేహాన్ని నానక్రాంగూడలోని ఇంటి నుంచి అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో పద్మాలయ స్టూడియోకు తీసుకువచ్చారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటల దాకా అభిమానులు నివాళులర్పించారు. తర్వాత రెండున్నరకు మహాప్రస్థానానికి అంతిమ యాత్ర సాగింది.
పోటెత్తిన అభిమానులు కృష్ణ చివరి చూపు కోసం వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియో వద్ద అందుబాటులో ఉంచుతారని తెలుసుకున్న అభిమానులు మంగళవారం అర్ధరాత్రి నుంచి అక్కడికి రావడం మొదలు పెట్టారు. ఉదయం ఏడు గంటలకే తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు రావడంతో పద్మాలయ స్టూడియో పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
సమయం గడుస్తున్న కొద్ది వేలాదిగా అభిమానులు తరలి వస్తుండటంతో పద్మాలయ స్టూడియో వద్ద వారిని అదుపు చేయడం ఒక దశలో కష్టంగా మారింది. స్టూడియోలోకి చొచ్చుకు పోయేందుకు కొందరు ప్రయత్నించారు. గోడలు ఎక్కి లోపలికి వెళ్లేందుకు చూశారు. దీంతో స్వల్ప లాఠీచార్జ్ చేశారు.
Source: Nijamtoday





