
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రిప్టోలో మదుపు చేసినవారంతా ఇప్పుడు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. బిలియన్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. కానీ, భారత్ మాత్రం అందుకు అతీతంగా నిలుస్తోంది. దానికి ఆర్బీఐ, ప్రభుత్వం, సెబీ సహా ఇతర నియంత్రణ సంస్థల ముందుచూపే కారణం.
క్రిప్టో కరెన్సీలను గుర్తించేందుకు ఆర్బీఐ ముందు నుంచి నిరాకరిస్తూనే వస్తోంది. పైగా వీటిలో మదుపు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండడంతో పన్నులతో గిరాకీపై దెబ్బ కొట్టింది. ఆ చర్యలే ఇప్పుడు మన భారతీయ మదుపర్లను రక్షించాయి. ఏడాది క్రితం మూడు ట్రిలియన్ డాలర్లుగా ఉన్న క్రిప్టో మార్కెట్ విలువ ఇప్పుడు ఒక ట్రిలియన్ డాలర్ల దిగువకు చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో ఒకటైన ఎఫ్టీఎక్స్.. కస్టమర్ల ఉపసంహరణల తాకిడితో దివాలా తీసే పరిస్థితి తలెత్తింది.
అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పరిగణిస్తున్న బిట్కాయిన్ ఓ దశలో 16,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 16,500 డాలర్లకు అటుఇటుగా ట్రేడవుతోంది. ఏడాది క్రితం ఇదే కాయిన్ 69,000 డాలర్ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అంటే నాటి నుంచి ఇప్పటి వరకు 75 శాతం పతనమైంది.