
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీ రైతులు పంట వ్యర్థాలను కాల్చేస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తోంది. దీంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. బుధవారం ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 354 (వెరీ పూర్)గా నమోదైంది. నోయిడాలో 406కి పడిపోయింది.
మంటలు రేపుతున్న కాలుష్యం
పంజాబ్లో సెప్టెంబర్ 15–నవంబర్ 1 మధ్య గతేడాదిని మించి 17,846 వ్యవసాయ వ్యర్థాల కాల్చివేతలు జరిగాయి. బుధవారం సైతం పంజాబ్లో 1,880 చోట్ల పంట వ్యర్థాల కాల్చివేత సాగింది. ఈ నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడా వంటి ఢిల్లీకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రాంతీయ ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని యూపీ, హరియాణా ప్రభుత్వాలను ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్రాయ్ అభ్యర్థించారు. కాలుష్య సమస్య రాష్ట్ర సమస్య కాదని, అభివృద్ధి చెందుతున్న వాయు వ్యవస్థ కారణంగా ఇది జరుగుతోందని, దీని కట్టడికి ఉమ్మడి సహకారం అవసరమని రాయ్ పేర్కొన్నారు.