
కొన్ని దశాబ్దాలుగా మీడియాలో హిందుత్వం అంటే మతం, మతతత్వమని, హిందువులు మతతత్వవాదులని, ముస్లింల మీద దాడులు చేస్తుంటారని ప్రచారం జరుగుతూ వస్తున్నది. మధ్యలో కొంతకాలం హిందూ ఉగ్రవాదమని కూడా ప్రచారం చేశారు.
ఇట్లా ప్రచారం చేయడం కొందరికి ఫ్యాషన్, కొందరికి ద్వేషం, కొందరికి అవసరం, కొందరికి సామ్యవాదం, ఉదారవాదం, సోషలిజం, కమ్యూనిజం సిద్ధాంతాల బోధనలు, కొందరు బ్రిటిష్ వాళ్ళ సాంస్కృతిక బానిసత్వంలో చిక్కుకుపోయి మాట్లాడేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అని మాట్లాడతారు. ఇస్లాం, క్రైస్తవంలాగా హిందుత్వము అంటే మతతత్వమని వారి ప్రచారం చేశారు.
గడిచిన రెండు వందల సంవత్సరాలుగా ఈ ప్రచారం సాగిపోతున్నది. వాళ్ళ లెక్క ప్రకారం హిందువులు తీవ్రవాదులు, ముస్లింలు సెక్యులర్ వాదులు. ఈమధ్య ఈనాడు పత్రికలో పి.ఎఫ్ ఐ. గురించి వచ్చిన వ్యాసంలో ”పిఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలు హింసోన్మాదాన్ని ఆయా ఘటనలు బట్టబయలు చేస్తున్నాయి. రహస్య ఎజెండాతో సామాజిక అశాంతికి దారులు తీస్తున్న ప్రతిపశక్తుల కట్టడికి కేంద్రం నడుం బిగించడం హర్షణీయం. జాతీయ భద్రతకు విఘాతకరమైన వాళ్ళలందరిపైన ఉక్కు పాదం మోపి తీరాల్సిందే” అని పేర్కొన్నారు. అంతటితో ఆగిపోకుండా.. పిఎఫ్ఐ సంస్థ ప్రారంభానికి బాబ్రీ మసీదు విధ్వంసమే కారణం అన్నట్లుగా రాశారు, ఇట్లా రాసేటువంటి వాళ్ళకి పిఎఫ్ఐకి ముందు ఇస్లాం ఉగ్రవాదం , తీవ్రవాదం లేదు అని అనుకొంటున్నారా? అంటే ఎవరిని మభ్యపెట్టేందుకు ఈ రాతలు? ఇస్లాం అనేది ఒక జాతి అని నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
హిందుత్వం మతతత్వం, తీవ్రవాదులు అని ప్రచారం చేసే వారిని నిలవరించవలసిన సమయం ఆసన్నమైంది. సైద్ధాంతికంగా ఎండ కట్టాలి. సిద్ధాంతపరంగా ఎదురు దాడి చేయవలసిన అవసరం కూడా ఉంది. నిరసనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. సత్యా సత్యాలను ప్రజలకు తెలియజేసే లా మాట్లాడటం, రాయటం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం చాలా చాలా అవసరం ఉన్నది.
ఇంగ్లాండ్ దేశంలో హిందూ సంస్థల ప్రయత్నం భేష్
అటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇంగ్లాండ్ దేశంలో ఉన్న హిందూ సంస్థలు చేశాయి. దశాబ్దాలుగా బీబీసీ చేస్తున్న విష ప్రచారంపై అక్టోబర్ 29న బీబీసీ కేంద్ర కార్యాలయం దగ్గర నిరసన ప్రదర్శన చేశారు. హిందుత్వంపై అవాస్తవాలు పుంఖాను పుంఖాలుగా రాయటం బీబీసీకి ఒక ఫ్యాషన్ అయిపోయింది.
ఆగస్టు 28న ఇంగ్లాండ్లోని ఈస్ట్ ల్యాండ్లో ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో భారత్ గెలిచింది. భారతి విజయం ప్రకటించిన వెంటనే ముస్లిం గ్రూపులు లెయిస్టర్ టౌన్లో హిందువులపై దాడులు మొదలు పెట్టాయి. హిందువుల ఇళ్ళను, కారులను తగలబెట్టారు. దేవాలయాలు ధ్వంసం చేశారు.
తాము చేసిన దాడులకు కారణాలను సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు కూడా చేశారు. ఎందుకంటే అక్కడి పోలీసులు ఈ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అసత్యమని నిరూపించారు. ఆ సోషల్ మీడియాలో చేసిన ప్రచారంలో హిందువులు ఒక మసీదును ధ్వంసం చేశారని, ఒక హిందూ యువకుడు ముస్లిం అమ్మాయిని కిడ్నాప్ చేయటానికి ప్రయత్నించాడని, అట్లాగే ట్రాఫిక్ వార్డెన్ అయిన ఒక ముస్లింను హిందువులు కొట్టారని సౌత్ ఆసియా పత్రిక ఒక వీడియో పోస్ట్ చేసింది.
అట్లాగే ఒక వ్యాసంలో భారతదేశంలో ముస్లింగా ఉన్నందుకే హిందువులు గుంపులు గుంపులుగా దాడి చేసి కొడుతున్నారని, పెద్ద పెద్ద హెడ్డింగ్లతో భారత్లో ఘర్షణలు చెలరేగడానికి ప్రయత్నించింది. భారత్లో ఎవరు ఎవరిపై దాడులు చేస్తున్నారు? అందరికీ తెలుసు కానీ, ఈ రకమైన దుష్ప్రచారం బిబిసిలో గడచిన 18 ఏళ్ళుగా మరింతగా పెరిగిపోయింది.
ఇట్లా హిందువులపై చేస్తున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బిబిసి డైరెక్టర్ జనరల్కు హిందూసంస్థల వాళ్ళు ఒక మెమోరండం కూడా ఇచ్చారు. ఇదే విధంగా లండన్లో గార్డియన్ పత్రిక కార్యలయం దగ్గర కూడా నిరసన ప్రదర్శన చేశారు.
– రాంపల్లి మల్లికార్జునరావు, ప్రముఖ విశ్లేషకులు, సామజిక కార్యకర్త
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





