
వాషింగ్టన్: చైనా దూకుడును నిలువరించేందుకు భారత్తో రక్షణ సంబంధాలను మెరుగుపర్చుకొనే ప్రణాళికలను అమెరికా సిద్ధం చేస్తోంది. అంతేకాదు సరిహద్దుల్లో చైనా గ్రేజోన్ కార్యకలాపాలను తిప్పికొట్టాలని కూడా బైడెన్ కార్యవర్గం భావిస్తోంది. అమెరికా రక్షణశాఖ విడుదల చేసిన నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీ 2022లో ఈ అంశాలను ప్రస్తావించింది. ‘రక్షణ శాఖ భారత్తో ఉన్న ప్రధాన రక్షణ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. చైనా దూకుడును అడ్డుకొనే సామర్థ్యాన్ని భారత్లో పెంచి.. స్వేచ్ఛాయుత హిందూ మహాసముద్రాన్ని కాపాడాల్సి ఉంది” అని ఆ వ్యూహ పత్రంలో పేర్కొంది. చైనా నుంచి వ్యవస్థీకృతమైన సవాళ్ళు ఎదురవుతున్నాయని పేర్కొంది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంపై ఈ పత్రంలో ప్రస్తావిస్తూ.. ”మిత్ర, భాగస్వామ్య దేశాల ప్రయత్నాలను రక్షణశాఖ బలోపేతం చేస్తుంది. అమెరికా పాలసీ, అంతర్జాతీయ చట్టాలను అనుసరించి చైనా గ్రేజోన్ కార్యకలాపాలను ఎదుర్కొంటాము” అని ఆ పత్రంలో పేర్కొంది. ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో అణ్వాయుధాల మోహరింపుల సమీక్ష, క్షిపణి రక్షణ వ్యవస్థ సమీక్ష వంటివి కూడా ఉన్నాయి.
Source: Eenadu





