
భాగ్యనగరం: హైదరాబాద్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన కేసులో నిందితులు అబ్దుల్ జాహెద్, మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లను సిట్ విచారిస్తోంది. ఈ నెల 17వరకు వారిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుంచి అందాయి ? గ్రనేడ్లు ఎలా సమకూరాయి ? ఇంకా ఎంతమంది టెర్రర్ స్లీపర్ సెల్స్ ఉన్నారు ? అనే వివరాలను రాబట్టే దిశగా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా అబ్దుల్ జాహెద్ ద్వారా భర్తీ అయిన ఉగ్రవాదుల సమాచారాన్ని కూడా సేకరించనున్నారు.
ఈ ముగ్గురిని నిన్న చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు.. రహస్య ప్రాంతంలో ఉంచి ప్రశ్నిస్తున్నారు. ముగ్గురినీ వేర్వేరు గదుల్లో ఉంచి ఒకరు చెప్పిన సమాధానాల గురించి మరొకరి వద్ద ప్రస్తావిస్తూ నిజానిజాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్లో ఉంటున్న లష్కరే తయ్యిబా ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ నుంచి హవాలా మార్గంలో వచ్చిన డబ్బులను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారనే వివరాలను సైతం రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
Source: Velugu





