News

ఛత్తీస్​గఢ్‌లో దారుణం… ముగ్గురు సాధువులపై దాడి!

419views

భిలాయ్ చరోడా: పిల్లలను ఎత్తుకేళ్ళుందుకు వచ్చారన్న అనుమానంతో ముగ్గరు సాధువులను గ్రామస్థులు దారుణంగా కొట్టారు. ఈ దాడిలో ఆ ముగ్గురు తీవ్రంగా గాయపడగా, ఒకరి తలకు దెబ్బ తగిలింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది ఆ ముగ్గురు సాధువులను గ్రామస్థుల బారి నుంచి రక్షించారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని చరోడా బస్తీలో జరిగింది.

భిలాయ్ చరోడా గ్రామానికి బుధవారం ముగ్గురు సాధువులు వచ్చారు. ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఆ ముగ్గురు సాధువులు గ్రామంలో తిరుగుతున్నారు. దారిలో ఓ సాధువు ఒక చిన్నారితో మాట్లాడారు. ఇంతలో ఎవరో పిల్లలను ఎత్తకెళ్తున్నారని కేకలు మొదలుపెట్టారు. ఇది విన్న గ్రామస్థులు సాధువులను పిల్లల దొంగలుగా అనుమానించి వారిని పట్టుకుని విచారించారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే వారిపై చేయి చేసుకోవడం ప్రారంభించారు.

ఇంతలో మిగతా గ్రామస్థులు అక్కడికి చేరుకుని సాధువులను తీవ్రంగా కొట్టారు. కర్రలతో సైతం దాడికి పాల్పడ్డారు. దాడి తీవ్రతరం అవుతున్న సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని గాయపడ్డ సాధువులను రక్షించి.. వారి వాంగ్మూలాన్ని తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.

సాధువులు రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన రాజ్‌బీర్ సింగ్, అమన్ సింగ్, శ్యామ్ సింగ్​గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ సాధువులు చరోడాలోనే నివసిస్తూ ప్రజల వద్ద నుంచి రేషన్​, బట్టలు లాంటివి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరు ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడలేదని విచారణలో తేలిందని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి