
344views
గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రజా పోరు యాత్ర వాహనానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. తెనాలిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ప్రజా పోరు యాత్ర వాహనం ఈనెల 21నుంచి తెనాలిలో తిరుగుతోంది. సుల్తానాబాద్లోని రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపి ఉంచారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రచార రథానికి కొందరు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.
ఒక్కసారిగా మంటలు మంటలు రావడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై మంటలను అర్పివేశారు. నలుగురు వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్టు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రభుత్వ అరాచకాల్ని ప్రజా పోరు ద్వారా ప్రజలకు వివరిస్తున్నందునే అధికార పార్టీకి చెందినవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.





