పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ ప్రతిపక్ష భాజపా చేపట్టిన ‘నబానా చలో’ మార్చ్ ఉద్రిక్తంగా మారింది. సచివాలయాన్ని ముట్టడించేందుకు భాజపా నేతలు, కార్యకర్తలు చేపట్టిన మెగా ర్యాలీని బెంగాల్ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి సహా పలువురు భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టీఎంసీ పాలనలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ భాజపా నేడు మెగా ‘నబానా చలో’ ర్యాలీకి పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది భాజపా కార్యకర్తలు రైళ్లు, బస్సుల్లో రాజధాని కోల్కతాకు బయల్దేరారు. అయితే, ఈ ర్యాలీకి పోలీసులు అనుమతినివ్వలేదు. అయినప్పటికీ భాజపా ర్యాలీపై ముందుకెళ్లడంతో పోలీసులు అడ్డుకొన్నారు. ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలు కోల్కతాకు రాకుండా రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ వద్ద భారీ బందోబస్తు ఉంది. హవుడా వంటి ప్రాంతాల్లో జల ఫిరంగులను కూడా ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలోనే పలు చోట్ల పోలీసులు, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకొన్నాయి. దీంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా పలువురు నేతలను అరెస్టు చేశారు. కోల్కతా ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతోన్న ప్రతిపక్ష నేత సువేందు అధికారి, మరో నేత లాకెట్ ఛటర్జీని మార్గమధ్యంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ కొందరు ఆందోళనకారులు సచివాలయం దిశగా మార్చ్ చేపట్టారు. దీంతో పోలీసులు జల ఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.
దీదీ.. కిమ్ లా వ్యవహరిస్తున్నారు…
ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై సువేందు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రజల మద్దతు లేదని, అయినప్పటికీ ఆమె ఉత్తరకొరియా నియంత కిమ్ లా పాలన చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని.. అప్పుడు టీఎంసీ నేతలు, పోలీసులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.