
న్యూఢిల్లీ: సంస్కృతాన్ని భారత జాతీయ భాషగా ప్రకటించాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని పరిశీలించడానికి కోర్టు సరైన వేదిక కాదని పేర్కొంది. ఈ అభ్యర్థనను పార్లమెంటులో లేవనెత్తాలి గానీ.. కోర్టుల్లో కాదని స్పష్టం చేసింది. “మీ అభ్యర్థనను సంస్కృతంలో రాయండి. ప్రచారం కోసం నోటీసులు జారీ చేయడంగానీ, ప్రకటనలు చేయడంగానీ ఎందుకు..? మీ అభిప్రాయాల్లో కొన్నింటితో మేము ఏకీభవించొచ్చు. కానీ, ఈ అంశాన్ని చర్చించడానికి సరైన వేదిక పార్లమెంట్. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. ఇది పాలసీలకు సంబంధించిన విషయం. దీనిని మేం మార్చలేం” అని న్యాయస్థానం పేర్కొంది. అనంతరం ఈ పిల్ను న్యాయస్థానం కొట్టివేసింది.
ఈ పిల్ను గుజరాత్ మాజీ అదనపు సెక్రటరీ కె.జి.వంజార దాఖలు చేశారు. హిందీతోపాటు సంస్కృతాన్ని కూడా జాతీయ భాషగా పేర్కొనాలని కోరారు. “సంస్కృత ఉచ్ఛారణలో జీవశక్తి ఉంటుంది. ఇది మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. దీని లయబద్ధమైన ఉచ్ఛారణ పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది” అని ఈ పిల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించడం వల్ల హిందీ, ఇంగ్లిష్ భాషలకు రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్లు దెబ్బతినవన్నారు.





