News

ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు 50 అడుగులు!

378views

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్​లో ‘ఖైరతాబాద్‌ గణేశ్‌’ వద్ద కోలాహలం ప్రారంభమైంది. బడా గణేశుడికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలి పూజ చేశారు. ఈ ఏడాది ‘పంచముఖ మహాలక్ష్మి గణపతి’గా గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ఈసారి 50 అడుగులతో ఏర్పాటు చేసిన బడా గణేశ్‌ను మొట్టమొదటిసారిగా పూర్తిగా మట్టితోనే తీర్చిదిద్దారు. వినాయకుడితో పాటు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, త్రిశక్తిగా పిలుచుకునే మహాగాయత్రిదేవీ కొలువుదీరారు. ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దర్శనానికి ఖైరతాబాద్ మెట్రో రైలు మార్గం నుంచి ప్రవేశం ఏర్పాటు చేశారు. ఐమాక్స్ వైపు నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధం చేశారు. గణేశ్‌ మండపం చుట్టూ భారీ భద్రత కల్పించారు. షీ టీమ్స్‌, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి