News

శాంతి కోరుకుంటూనే క‌శ్మీర్‌ను మ‌రిచిపోని పాకిస్తాన్‌!

309views

న్యూఢిల్లీ: భారత్‌తో శాంతియుత సంబంధాలకు సిద్ధమని పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు లోబడి కశ్మీర్‌ సమస్య పరిష్కారంతోనే ఈ ప్రాంతంలో సుస్థిర శాంతి నెలకొంటుందని అన్నారు. ‘యుద్ధం రెండు దేశాలకు ఎంతమాత్రం మంచిది కాదు… భారత్‌తో చర్చల ద్వారా శాశ్వత శాంతి స్థాపన జరగాలని కోరుకుంటున్నాం. అయితే, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు లోబడి కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం లభించినప్పుడే ఈ ప్రాంతంలో శాంతి స్థాపన సాధ్యం’అని హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థుల బృందంతో ఆయన పేర్కొన్నట్లు ‘ది న్యూస్‌ ఇంటర్నేషనల్‌’ తెలిపింది.

వాణిజ్యం, ఆర్థిక రంగాలతోపాటు ప్రజల జీవన స్థితిగతులను పెరుగుపరచడంలో ఇరు దేశాల మధ్య పోటీ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘పాక్‌ దురాక్రమణదారు కాదు. మా  రక్షణ వ్యయం సరిహద్దుల రక్షణ కోసమే తప్ప దురాక్రమణ కోసం కాదు’అని అన్నారు.  ‘పాక్‌ ఆవిర్భావం తర్వాత మొదట్లో ఆర్థికంగా అన్ని రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించింది. అనంతరం రాజకీయ అస్థిరత, సంస్థాపరమైన లోపాల కారణంగా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది’అని ఆయన చెప్పారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన అనంతరం భారత్, పాక్‌ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి