
భాగ్యనగరం: హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సికింద్రాబాద్లోని ఓ సాధారణ పార్టీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. అమిత్ షాకు స్థానిక కార్పొరేటర్ స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర హోం మంత్రిని బీజేపీ కార్యకర్త సత్యనారాయణ తన ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సత్యనారాయణ అందించిన వేడివేడి కాఫీని షా తాగారు.
కాఫీ తాగుతూ.. సత్యనారాయణ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణ ఇంటికి అమిత్ షా చేరుకోగానే స్థానిక బీజేపీ కార్యకర్తలు ఆయనను కలిసేందుకు పోటీపడ్డారు. దీంతో వారిని పోలీసులు అదుపు చేశారు. సత్యనారాయణ ఇంట్లోకి కేవలం అనుమతి ఉన్న అతికొద్ది మందిని మాత్రమే అనుమతించారు. షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు.
ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త పార్టీ గెలుపు కోసం బలంగా పోరాడాలని సూచించారు. పార్టీ ప్రతీ ఒక్కరికీ గౌరవం దక్కుతుందని అమిత్ షా హామీ ఇచ్చారు.
‘‘ఈ రోజు మా జన్మ ధన్యమైంది. మొత్తం దేశానికి హోం మంత్రిగా ఉన్న వ్యక్తి .. చిన్నపాటి బస్తీలో ఉన్న మా ఇంటికి రావడం నిజంగా గొప్ప అదృష్టం. మేం దీన్ని జీవితాంతం మర్చిపోలేం. నిన్నటి నుంచి మా కాలనీలో పండుగ వాతావరణం ఉంది. అమిత్ షా కోసం వేయికళ్లతో ఎదురుచూశాం. ఆయన మా ఇంటికి రాగానే ఆనందాన్ని ఆపుకోలేకపోయాం’’ అని బీజేపీ కార్యకర్త సత్యనారాయణ అన్నారు.
Source: Nijamtoday





