
-
ఏపీ ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక
విజయవాడ: స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు గడిచినా ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైందని ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక(ఆంధ్రప్రదేశ్) ఆవేదన వ్యక్తం చేసింది.

ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ, వీరిపై మత మార్పడి శక్తుల గురి, హిందూ వ్యతిరేక చర్యలను అడ్డుకోవడం వంటి చర్యల నిమిత్తం వేదిక రాష్ట్రస్థాయి సమావేశాలు ఇక్కడ శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూల నుంచి ఎంపిక చేసిన ప్రతినిధులు హాజరైన ఈ సమావేశాలు… ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి నిమిత్తం పలు తీర్మానాలను వేదిక ఏకగ్రీవంగా ఆమోదించింది.
తీర్మానాలు
1) ఎస్సీ, ఎస్టీల ఆర్థికాభివృద్ధి కొరకు రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ, ప్రభుత్వం ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా 40% నిధులు ఇస్తే, కేంద్రం 60% నిధులు అందచేస్తుంది. అయితే, గత మూడేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు నిధులు ఇవ్వటం లేదు. ఫలితంగా ప్రతి సంవత్సరం ఒక లక్ష మంది ఎస్సీ, ఎస్టీల లబ్ధిదారులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ఈ దృష్ట్యా ఎప్పటికప్పుడు ఎస్సీ, ఎస్టీల సంక్షేమం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి.
2) అయిదేళ్ళ కిందట ఎస్సీ/ఎస్టీ వసతి గృహాల్లో విద్యార్థికి తలసరికి ఇస్తున్నది రూ. 1250/- ఈ చెల్లింపులో ఎటువంటి మార్పులు చేయలేదు. ధరలు పెరిగినా నేడూ కూడా అంతే ఇస్తున్నారు. ఈ కేటాయింపులను రాష్ట్ర ప్రభుత్వం పెంచని కారణంగా ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ళలోని విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణం ఆ 1250 రూపాయలను నేటి ధరలకు అనుగుణంగా పెంచాలి.
3) గోదావరి వరదల వల్ల పోలవరం నిర్వాసితుల కొరకు నిర్మించిన కొత్త పునరావాస గ్రామాల్లోకి, పోలవరం ముంపు ఉండదని భావించిన గ్రామాల్లోకి ఇలా మొత్తం 326 గ్రామాల్లో పోలవరం నిర్మాణం పూర్తి కాకపోయినా వరద నష్టం ఏర్పడింది. ఈ స్థితిలో నేటి ప్రభుత్వ అంచనాలు పొరపాటు అనీ, పోలవరం పునరావాసం విషయమై, కొత్త అంచనాలు వేయాలని వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దూలం బుసిరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు గరికిముక్కు సుబ్బయ్య, పాంగి రామయ్య డిమాండ్ చేశారు.





