News

ఇరవయ్యయిదేళ్ళలో… ఈ అయిదు సూత్రాలతో అభివృద్ధి సాధిద్దాం

289views

* ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవ సందేశం

* ప్రజలంతా వీటిపై తమ శక్తిని కేంద్రీకరించాలని పిలుపు

భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చి, బానిసత్వం జాడలను సమూలంగా తొలగించేందుకు దేశప్రజలంతా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. జాతి సంపద, ఐక్యతను కాపాడుతూ, వచ్చే 25ఏళ్లలో భారత్ ను సమున్నత దేశంగా తీర్చిదిద్దేందుకు పనిచేయాలని సూచించారు. ఇందుకోసం ప్రధాని.. ఐదు తీర్మానాలను ప్రతిపాదించారు. ప్రజలంతా వీటిపైనే తమ శక్తినంతా కేంద్రీకరించాలని పిలువునిచ్చారు.

స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అయ్యే నాటికి.. మన దేశం కోసం పోరాడిన వారి కలలను సాకారం చేసి చూపించాలి. వచ్చే 25ఏళ్ల పాటు యువత దేశాభివృద్ధి కోసం తమ జీవితాలను అంకితం చేయాలి. దేశమే కాకుండా మొత్తం మానవజాతి అభివృద్ధికి పాటుపడాలి. అదే భారతదేశానికి ఉన్న బలం. పెద్ద సంకల్పాలతో ముందుకు కదలాలి. స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి ‘భారత్ అభివృద్ధి చెందిన దేశ’మనే కల సాకారం కావాలి. ఇందుకోసం వచ్చే 25 ఏళ్ల పాటు ఐదు సూత్రాలపై దృష్టిసారించాలి. 1.అభివృద్ధి చెందిన భారతం, 2.బానిసత్వ నిర్మూలన, 3.ఘనమైన వారసత్వం, 4.ఏకత్వం, 5.పౌరబాధ్యత ఇవే మన పంచప్రాణాలు. పంచప్రాణాల మార్గదర్శనంలో వచ్చే 25 ఏళ్లు సమష్టిగా పనిచేద్దాం. 130 కోట్ల మంది సంకల్పంతో ఇది సాధ్యమవుతుంది. 130 కోట్ల మంది ఒక్క అడుగు ముందుకు వేస్తే.. దేశం 130 కోట్ల అడుగులు ముందుకు వేస్తుంది.” అని ప్రధాని పేర్కొన్నారు.

మహాత్మాగాంధీకి ప్రధాని నివాళి :

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. ప్రధాని మోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం వరుసగా ఇది తొమ్మిదోసారి. అంతకుముందు ప్రధాని సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రకోట వద్దకు విచ్చేసే ముందు జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. రాజ్ ఘాట్ కు వెళ్లిన ప్రధాని మోడీ, గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకల నేపథ్యంలో ఎర్రకోట చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.