
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో గోధన్ న్యాయ్ యోజన తీసుకొచ్చినందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాదు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆవు పేడ ద్వారా కంపోస్ట్ తయారు చేయడాన్ని కూడా ప్రధాని మెచ్చుకున్నారు.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఈ విషయమై కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ప్రధాన మంత్రి అభినందించారు. ఛత్తీస్గఢ్లో గోధన్ న్యాయ్ యోజన పథకం ద్వారా ఆవు పేడను సేకరిస్తారు. కిలో రెండు రూపాయల చొప్పున మహిళలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఇది సేకరిస్తున్నారు. 2020 జులై నుంచి ఆవు పేడను సేకరిస్తుండగా, గత నెల 28 నుంచి గోమూత్రాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించారు.
లీటర్ గో మూత్రానికి 4 రూపాయలిస్తారు. ఆవు పేడ, మూత్రం ద్వారా జీవామృతాన్ని తయారు చేస్తున్నారు. ఇలా తయారయ్యే ఈ జీవామృతంలో ఉండే సూక్ష్మ జీవులు నేలను సారవంతం చేస్తాయి. గోధన్ న్యాయ్ యోజన పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నగదు పంపుతోంది.
Source: Nijamtoday





