
-
ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం తిరంగా బైక్ ర్యాలీని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించింది. ఎర్రకోట నుంచి ఇండియా గేట్ వరకు బైక్ ర్యాలీ జరిగింది. ఎర్రకోట వద్ద బైక్ర్యాలీని జెండా ఊపి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా దేశ ప్రజలంతా ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్ళపై త్రివర్ణ పతాకాలు ఎగరేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో తమ ప్రొఫైల్ పిక్గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని కోరారు. పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు పలు కార్యక్రమాలు చేయాలని సూచించారు.
ఆగస్టు 11 నుంచి 13 వరకు మహాత్మా గాంధీకి ఇష్టమైన ‘రఘుపతి రాఘవ రాజారామ్’, ‘వందేమాతరం’ గీతాల్ని ఆలపించాలని నడ్డా తెలిపారు. మంగళవారం, ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అనంతరం కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి.. తిరంగా బైక్ ర్యాలీ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని అన్నారు.





