
-
1777 కంపెనీల మూసివేత
-
వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: దేశంలో నమోదైన 5,068 విదేశీ కంపెనీల్లో 2022 జూలై 27వ తేదీ నాటికి 3,291 కంపెనీలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు. క్రియాశీలంగాలేని విదేశీ కంపెనీల రిజిస్ట్రేషన్ను రద్దు చేసే అంశాన్ని పరిశీలించడం లేదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కంపెనీల చట్టం, 2013ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది.
దేశంలో పనిచేస్తున్న కంపెనీలు ఈ చట్టం కింద తప్పనిసరిగా నమోదుకావాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం పొందిన తర్వాత విదేశీ కంపెనీలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) ఢిల్లీలో నమోదవుతాయి. విదేశీ క్రియాశీల కంపెనీలు తప్పనిసరిగా చట్ట ప్రకారం స్టాట్యూటరీ ఫైలింగ్ జరుపుతాయి. వివిధ చట్ట పరమైన అంశాలకు అనుగుణంగా పనిచేస్తాయి. ఆయా అంశాలపై లోక్సభలో మంత్రి లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. భారతదేశంలో 1,777 విదేశీ కంపెనీలు తమ వ్యాపార కార్యాలయాను మూసివేసినట్లు చెప్పారు.





