
అమరావతి: ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా (ఇంటింటా మువ్వన్నెల జెండా) కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశించారు.
సచివాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రానికి 1.42 కోట్ల జెండాల కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపాం. ఇందులో 40 లక్షల వరకు రాష్ట్రానికి అందనున్నాయి. మెప్మా 30 లక్షలు, సెర్ప్ ద్వారా మరో 10 లక్షల జెండాలు అందుబాటులోకి వస్తాయి. అటవీశాఖ 80 లక్షల జెండా కర్రలు అందిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు, లయన్స్, రోటరీ క్లబ్, ఇతర సంఘాల ద్వారా అవసరమైన జెండాలను సమకూర్చుకునేందుకు వీలుగా ఆయా సంఘాలు, సంస్థల సహకారాన్ని తీసుకుంటాం. విద్యా సంస్థలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను భాగస్వాములను చేయాలి. స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ సంఘాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, బార్ అసోసియేషన్లు, ఫిక్కీ, ఏపీఐఐసీ, పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థల ద్వారా జెండాలను సమకూర్చుకోవాలి’’ అని పేర్కొన్నారు.





