News

వారి లూటీపై మాట్లాడినందుకే ఆరోపణలు: రాహుల్‌పై మండిప‌డ్డ స్మృతి ఇరానీ

535views

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే 2024 ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. రాహుల్​కు మరోసారి ఓటమి తప్పదని మండిపడ్డారు. తన కుమార్తె అక్రమంగా బార్ నడుపుతున్నారంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై స్పందించిన ఇరానీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

’18ఏళ్ళ‌ ఓ యువతిని, ఓ కాలేజీ విద్యార్థినిని కాంగ్రెస్ పార్టీ అవమానించింది. ఆమె క్యారెక్టర్​ను నాశనం చేసింది. ఆ యువతి తల్లి రాహుల్ గాంధీపై పోటీ చేయడమే చేసిన తప్పు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చేసిన రూ.5వేల కోట్ల లూటీ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమే నేను చేసిన తప్పు. అందుకే నా కుమార్తెపై ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఆరోపించినట్టు నా కూతురు బార్ నడపడం లేదు. కాలేజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ తప్పుడు ఆరోపణలపై నేను కోర్టులోనే తేల్చుకుంటాను’ అని స్మృతి స్పష్టం చేశారు.

అంతకుముందు, గోవాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె అక్రమంగా బార్‌ నడుపుతున్నందున, ఆమెను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. స్మృతి ఇరానీ కుటుంబంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న కాంగ్రెస్‌ అధికారి ప్రతినిధి పవన్‌ ఖేరా.. గోవాలో ఆమె కుమార్తె నకిలీ లైసెన్స్‌తో బార్‌ నడుపుతున్నట్టు ఆరోపించారు. ఇది గోవా చట్టాలకు వ్యతిరేకం అని అన్నారు.

ఖండించిన స్మృతి కుమార్తె..

ఈ ఆరోపణలను స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ సైతం ఖండించారు. కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని అందులో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ చెబుతున్న రెస్టారెంటుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ జోయిష్‌ తన లాయర్‌ ద్వారా ఓ ప్రకటన విడుదల చేయించారు. 18ఏళ్ల జోయిష్‌ వర్ధమాన చెఫ్‌ అని, అనేక రెస్టారెంట్లలో వంటలు చేస్తుంటారని ఆమె లాయర్‌ పేర్కొన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి